నాగిరెడ్డిపేట: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ కన్నారెడ్డిగేట్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం రైతులు రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, నాగిరెడ్డిపేట తహసీల్దార్ భిక్షపతి, ఎస్సై భార్గవ్గౌడ్ రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. తూకం వేసిన ధాన్యాన్ని రైస్మిల్లులకు పంపించడంలో తాండూర్ సొసైటీ సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నారని, తమ గ్రామానికి రావాల్సిన లారీలను ఇతర గ్రామాలకు పంపిస్తున్నారని రైతులు ఆరోపించారు. వారి వైఖరి కారణంగా తమ ధాన్యం వర్షానికి తడుస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. లారీలను రప్పించి ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలింపజేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.


