● ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి
బాన్సువాడ: మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాల్రాజ్తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలు పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తుందని అన్నారు. బాన్సువాడలో ఇళ్లు లేని నిరుపేదలకు గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తే చాలా మంది అనర్హులకే అందాయని అన్నారు. ఇంకా చాలా కాలనీల్లో ఇళ్లు లేని పేదలు ఉన్నారని అన్నారు. వార్డులో ఉండే నాయకుల తీరుపై పోచారం ఆగ్రహాం వ్యక్తం చేశారు. 10 మహిళ సంఘాలకు రూ. 2 కోట్ల చెక్కును అందజేశారు.
శిక్షణ కేంద్రం ప్రారంభం
బాన్సువాడలోని ఐకేపీ కార్యాయలం వద్ద మహిళ సమాఖ్య సముదాయక నిర్వహణ శిక్షణ కేంద్రాన్ని బుధవారం పోచారం శ్రీనివాస్రెడ్డి, కాసుల బాల్రాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో రెండు మండలాలకు ఈ శిక్షణ నిర్వహణ కేంద్రాలు మంజూరు అయ్యాయని, అందులో ఒకటి దోమకొండ, మరొకటి బాన్సువాడకు వచ్చిందన్నారు. మండలంలోని 52 మహిళ సంఘాలకు రూ.6.13 కోట్ల చెక్కును అందజేశారు. మెప్మా పీడీ శ్రీధర్రెడ్డి, ఏపీడీ విజయలక్ష్మి, డీపీఎం శ్రీనివాస్ ఉన్నారు.


