పట్టుకోండి చూద్దాం! | - | Sakshi
Sakshi News home page

పట్టుకోండి చూద్దాం!

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

పట్టుకోండి చూద్దాం! అప్రమత్తంగా ఉండాలి పోలీసుల సూచనలు..

● ఇళ్లకు ఎక్కువకాలం తాళం వేసి వెళ్తే సమీప పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి.

● సీసీ కెమెరాలు, భద్రతా పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి.

● కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి.

● బంగారం వంటి విలువైన వస్తువులను బ్యాంక్‌ లాకర్లలో భద్రపరచుకోవాలి. ఎక్కువ నగదును ఇంట్లో ఉంచుకోవద్దు.

● పొరుగువారితో సమన్వయం కలిగి పరస్పర పర్యవేక్షణ కొనసాగించాలి.

వేసవి సెలవులు కావడంతో పట్టణాల్లో నివసిస్తున్నవారు ఇళ్లకు తాళం వేసి స్వగ్రామాలకు వెళ్లారు. మరికొందరు బంధువుల ఇళ్లకు, తీర్థయాత్రలకు వెళ్తున్నారు. ఇదే సమయంలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులు నిత్యం ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నా, గస్తీలు తిరుగుతున్నా చోరీలు ఆగడం లేదు. వరుసగా జరుగుతున్న చోరీలు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి.

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌..

జిల్లాలో ఇటీవల వరుసగా చోరీలు జరుగుతున్నాయి. ఈనెల 8 న కామారెడ్డిలోని లిక్కర్‌ మార్ట్‌లో చోరీ జరిగింది. ఇద్దరు దుండగులు షటర్‌ తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించి కౌంటర్‌లో దాచి ఉంచిన రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. అదే రోజు రాత్రి ఎల్లారెడ్డి, దోమకొండ మండల కేంద్రాల్లో సైతం దొంగలు కలకలం సృష్టించారు. దోమకొండలోని ఓ తాళం వేసిన ఇంట్లో చోరీ జరగ్గా.. ఎల్లారెడ్డిలోని ఓ జువెలరీ దుకాణం షటర్‌ తాళాలు పగులగొట్టేందుకు విఫలయత్నం చేశారు.

● ఈనెల 10 న బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని మండలం శ్రీనగర్‌ గ్రామంలో 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. 4 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

● ఈనెల 11 న ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన 7 ఇళ్లలో చోరీలకు పాల్పడి దాదాపు 27 తులాల బంగారం, 47 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

● ఈనెల 12 న రాత్రి బీర్కూర్‌లో దొంగలు హల్‌చల్‌ చేశారు. ఓ కాలనీలో తాళం వేసిన మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 20 తులాల బంగారం, 120 తులాల వెండి, రూ. లక్షన్నర నగదు దోచుకెళ్లారు.

● ఈనెల 23న జిల్లా కేంద్రంలోని జయశంకర్‌ కాలనీలో దొంగల సంచారం కలకలం రేపింది. వేకువజామున ఇద్దరు దుండగులు తాళం వేసిన ఇళ్లను గమనిస్తూ కాలనీలో సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. దీంతో కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు.

దొంగతనాల నివారణకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సీసీ కెమెరాల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నాం. అనుమానితులపై ఎల్లవేళలా నిఘా ఉంటుంది. తాళం వేసి ఊరెళ్లేవారు ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచకూడదు. ఎక్కువ రోజులు తాళం వేసి టూర్లకు వెళ్లేవారు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. – రాజేశ్‌ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి

గతంలో వేసవి కాలంలో మాత్రమే చోరీల ఘటనలు వెలుగు చూసేవి. అంతర్‌జిల్లా దొంగలు, ముఠాల సంఖ్య తక్కువగా ఉండేది. అలాంటి దొంగలు జైలుకు వెళ్తే మళ్లీ వారు బయటికి వచ్చేదాకా చోరీ కేసులు వెలుగు చూసేవి కావు. కొంత కాలంగా ముఠాలు, దొంగల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఎంత మంది జైలులో ఉన్నా కొత్త చోరీల ఘటనలు వెలుగుచూస్తుండడమే ఇందుకు ఉదాహరణ. గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో మహారాష్ట్రకు చెందిన కొన్ని ముఠాలు మాత్రమే సంచరించేవి. కొంతకాలంగా అనేక రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఇక్కడ సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఉపాధి, వలస పేరుతో వచ్చే వారిలో పలువురు, వ్యసనాల బారిన పడిన కొందరు ఈజీ మనీ కోసం చోరీల వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు రాత్రికి రాత్రి దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు.

జిల్లాలో రెచ్చిపోతున్న

దొంగలు

వరుస చోరీ ఘటనలతో

జనంలో ఆందోళన

పోలీసులకు తలనొప్పిగా

మారుతున్న కేసులు

జిల్లాలో ఈ నెలలో పలు చోరీలు జరిగాయి. ఆయా కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈనెల 8 న కామారెడ్డిలోని లిక్కర్‌ మార్ట్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి నిందితులను రిమాండ్‌కు పంపించారు. చాలా కేసులు సవాల్‌గానే ఉన్నాయి.

జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. ఇటీవల దొంగల ముఠాల సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తోంది. వరుసగా జరుగుతున్న చోరీ లతో జనం ఆందోళన

చెందుతున్నారు.

– కామారెడ్డి క్రైం

Advertisement
 
Advertisement
Advertisement