ఎల్లారెడ్డి: ధాన్యం తూకం వేసి రోజులు గడుస్తున్నా మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. బుధవారం ఎల్లారెడ్డి మండలం హాజీపూర్లో ఎల్లారెడ్డి –కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలరోజులవుతున్నా కాంటాలు కావడం లేదని, కాంటా అయిన వడ్లు మిల్లులకు తరలడం లేదని పేర్కొన్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలోనే గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షంతో వడ్లకు మొలకలు వచ్చాయన్నారు. తూకాలను వేగవంతం చేయాలని, కాంటా వేసిన వడ్లను వెంటవెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై ధాన్యం పోసి నిప్పుపెట్టి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రేంకుమార్, ఎస్సై రాజు సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించడంతో రాస్తారోకో విరమించారు.


