సోషల్ మీడియాపై కఠిన నిఘా
ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: బక్రీద్ నేపథ్యంలో జిల్లాలోని ఈద్గాలు, మసీదులు, సున్నిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు, భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మంగళవారం జిల్లాలోని వివిధ పీఎస్ల ఎస్హెచ్వోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు ఇచ్చారు.
జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈద్గాల వద్ద పార్కింగ్ ఏర్పాట్లు, అవసరమైన చోట్ల ముందస్తు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి అసత్య ప్రచారాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, సమాజంలో అలజడి సృష్టించే వదంతులు వ్యాప్తి చెందకుండా సైబర్ మానిటరింగ్ను మరింత బలోపేతం చేయాలన్నారు.
సోషల్ మీడియా వేదికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద సమాచారం గానీ ప్రచారాలు గానీ దృష్టికి వస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద సిబ్బంది 24 గంటల పాటు నిరంతరాయంగా విధులు నిర్వహించాలన్నారు.
పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్లో ఏఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


