● ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
● ఇందిరా మహిళా శక్తి భవనాలకు
వర్చువల్గా భూమిపూజ
కామారెడ్డి టౌన్ : ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందిరా మహిళా శక్తి గ్రామ సంఘాల భవనాల భూమిపూజ, ప్రారంభోత్సవ కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్వీ గిరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కొత్తగా నిర్మించే గ్రామ సంఘాల భవనాలు మహిళా పరస్పర సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద చేపడుతున్న ఈ కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. రూ.43.70 కోట్లతో భవనాలు, గోదాములు నిర్మించనున్నట్లు తెలిపారు. డీఆర్డీవో దామోదర్రెడ్డి, అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి ప్రమీల, జిల్లా సమాఖ్య కోశాధికారి లక్ష్మి, కార్యదర్శి రాజమణి, వివిధ మహిళా సమాఖ్య సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


