క్యాన్సర్‌ బారిన బాలిక | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ బారిన బాలిక

May 25 2026 3:22 AM | Updated on May 25 2026 3:22 AM

చికిత్సకు రూ. 4.50 లక్షలు

ఆపన్నహస్తం కోసం

ఎదురుచూపులు..

నవీపేట : నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని నాళేశ్వర్‌ గ్రామానికి చెందిన ఈరవేణి మాధురి(15) ప్రమాదకర క్యాన్సర్‌తో పోరాడుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన మాధురి క్యాన్సర్‌ చికిత్సకు రూ. 4.50 లక్షలు అవసరమవడంతో ఆసన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామానికి చెందిన ఈరవేణి లతకు మాధురి, కృపాలి ఇద్దరు కుమార్తెలు. ఈరవేణి లత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ వద్ద వంట మనిషిగా పని చేస్తోంది. భర్త కుటుంబ కలహాలతో దూరంగా ఉంటున్నాడు. పెద్ద కూతురు మాధురి ఆర్మూర్‌లోని కేజీబీవీలో విద్యాభ్యాసం చేస్తుంది. కొన్ని రోజుల కిత్రం ఆడుకునే సమయంలో కాలికి గాయమైంది. తగ్గకపోవడంతో వైద్యులను సంప్రదించగా క్యాన్సర్‌కు దారితీసినట్లు తెలిసింది. అప్పటికే అక్కడిక్కడ అప్పు చేసి రూ. 3 లక్షలు ఖర్చు చేశారు. ఈ చికిత్సకు మరో రూ. నాలుగున్నర లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు. చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. చికిత్సకు సహకరించే దాతలు 62243637962(ఐఎఫ్‌ఎస్‌సీ 72111947869) కు డబ్బులు పంపాలని తల్లి లత వేడుకుంటోంది.

రూ.76 వేల ఆర్థిక సహాయం

ఈరవేణి మాధురి దైన్య స్థితిని గమనించిన గ్రామానికి చెందిన కోనేరు ప్రసాద్‌ తన బీటెక్‌ మిత్రులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. స్పందించిన మిత్రులు రూ. 76 వేలు పోగు చేయగా చికిత్స నిమిత్తం మాధురి తల్లి లతకు ఈ నగదును అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement