కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో అర్ధరాత్రి వేళ దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. శనివారం తెల్లవారుజామున సుమారు 2:57 గంటల సమయంలో కాలనీలోని వీధుల్లో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ సీసీ టీవీ కెమెరాకు చిక్కారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసేందుకే వీరు అర్ధరాత్రి వేళల్లో రెక్కీ నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో కాలనీవాసులు, పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ సీఐ నరహరి సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని లేదా పొరుగువారికి చెప్పి వెళ్లాలని కోరారు. రాత్రి సమయాల్లో ఇళ్ల ముందు లైట్లు ఆన్ చేసి ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్–100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.


