● కబళించిన బ్లడ్ క్యాన్సర్
● లక్ష్మీరావులపల్లిలో విషాదం
మాచారెడ్డి: వారసుడు పుట్టాలని ఎన్నో దేవుళ్లను మొక్కిన ఆ వ్యక్తికి కొడుకు పుట్టిన ఆనందాన్ని ఎంతోకాలం ఆస్వాదించలేదు. కొడుకు పుట్టిన పన్నెండు రోజులకే ఆ తండ్రిని బ్లడ్ క్యాన్సర్ కబళించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లక్ష్మీరావులపల్లికి చెందిన పుట్ట శంకర్(38)ఈ నెల 21వ తేదీన ఉన్నట్టుండి బాత్రూంలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారించారు. అప్పటికే పరిస్థితి చేయిదాటి పోవడంతో వైద్యులు చేతులెత్తేశారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శంకర్ శుక్రవారం కన్నుమూశాడు. ఇద్దరు కూతుళ్ల తరువాత 12 రోజుల క్రితమే శంకర్కు కొడుకుపుట్టాడు. వారసుడు పుట్టిన ఆనందం ఆ కుటుంబంలో లేకుండాపోయింది. శంకర్ మృతితో భార్య, ముగ్గురు పిల్లలు దిక్కులేనివారయ్యారు.


