సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉపాధ్యాయ వృత్తిలో పాతికేళ్లుగా కొనసాగుతున్న యాదయ్య సార్ పాఠాలు బోధించడం, పిల్లలను మోటివేట్ చేయడమే తన లోకంగా జీవిస్తున్నారు. అటు విద్యార్థులకు, ఇటు తల్లిదండ్రులకు అభిమాన టీచర్గా నిలుస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల జిల్లా పరిషత్త్ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నాయకుని యాదయ్య అనే ఉపాధ్యాయుడు పొద్దస్తమానం విద్యార్థుల చదువుకే సమయాన్ని వెచ్చిస్తారు. పనిచేసిన చోటే నివాసం ఉంటారు. రాత్రుల్లో సైతం పిల్లల ఇళ్లకు వెళ్లి పాఠ్యాంశాల్లోని వారి అనుమానాలు నివృత్తి చేస్తారు. లెక్కలంటే ఉండే భయాన్ని పోగొట్టి వారికి లెక్కల సబ్జెక్టును ఇష్టంగా మారుస్తారు. పిల్లలే కాదు వారి తల్లిదండ్రుల మన్ననలు పొందుతున్నారు యాదయ్య సార్. పెద్దకొడప్గల్ మండలం వడ్లం, బిచ్కుంద మండలం దడ్గి, జుక్కల్ మండలం ఖండేబల్లూర్ తదితర పాఠశాలల్లో పనిచేసిన యాదయ్య రెండేళ్లుగా మత్తమాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. అప్పట్లో 10 గంటలకు స్కూల్ ఉన్నపుడు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు తీసుకునేవారు. స్కూల్ సమయం 9 గంటలకు మారిన తరువాత సాయంత్రం ఒక పూట ప్రత్యేక తరగతి తీసుకుంటున్నారు. పరీక్షల సమయంలో అయితే రాత్రి వరకూ విద్యార్థులను చదివిస్తూ ఉంటారు. పదో తరగతి పరీక్షలు నడుస్తున్న ప్రస్తుత సమయంలో ఆయన పిల్లల ఇళ్లకు వెళ్లి వారి చదువులను పర్యవేక్షిస్తుంటారు. మత్తమాల పాఠశాలకు మత్తమాలతోపాటు రుద్రారం నుంచి విద్యార్థులు వస్తుంటారు. ఆయా గ్రామాలకు వెళ్లి వారి చదువుల సంగతి పరిశీలించి మ్యాథ్స్ పై ఉన్న అనుమానాలు నివృత్తి చేయడం ద్వారా ఆయన పిల్లల్లో మ్యాథ్స్ అన్న భయాన్ని ఎప్పటికప్పుడు పోగొడుతూ వారిని తీర్చిదిద్దుతున్నారు. స్కూల్లో చదివే పిల్లలంతా యాదయ్య సార్ అంటే ప్రత్యక అభిమానం చూపుతారు.
పదో తరగతిపై ప్రత్యేక దృష్టి
స్కూల్లో పదో తరగతి చదివే విద్యార్థులపై యాదయ్య సార్ ప్రత్యేక దృష్టి సారిస్తారు. వారికి ప్రత్యేక తరగతులు తీసుకోవడం, స్టడీ అవర్స్, ఇంటి దగ్గరకు వెళ్లి చదివించడం వంటివి చేస్తుంటారు. తద్వారా మంచి మార్కులు సాధించేలా ప్రిపేర్ అయ్యారు. లెక్కలంటే భయం వీడి, ఇష్టంగా చదివేలా తీర్చిదిద్దుతున్నారు. పిల్లల చదువుకే ఎక్కువ సమయం వెచ్చిస్తారు. పరీక్షల సమయంలో ప్రతి విద్యార్థి ఇంటికి వెవెళ్లి వారితో మాట్లాడడం, వారికి ధైర్యాన్నిచ్చి ప్రోత్సహిస్తారు. తొమ్మిదో తరగతి పరీక్షలు అయిపోగానే వారికి కూడా పదో తరగతి అడ్వాన్సు క్లాసులు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఈ సందర్భంగా యాదయ్య సార్ను ‘సాక్షి’ పలకరించగా వీలైనంత ఎక్కువ సమయం పిల్లలకు కేటాయించడం మూలంగా వారు చదువులో రాణించగలుగుతున్నారు. వారికి మ్యాథ్స్లో ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయగలుగుతున్నాను. స్థానికంగా ఉండి వారి చదువును పర్యవేక్షించడంలో ఎంతో ఆనందం ఉంది. తల్లిదండ్రులు ఎంతో ఆదరిస్తున్నారు. ఇలాగే కొనసాగిస్తాననని పేర్కొన్నారు.
ఉద్యోగం చేస్తున్న చోటే నివాసం
ప్రత్యేక తరగతులు..
‘లెక్కల’ భయం పోగొట్టే ప్రయత్నం
మంచి మార్కులు సాధించేలా చొరవ
యాదయ్య సార్ అంటే విద్యార్థులు,
తల్లిదండ్రులకు ప్రత్యేక అభిమానం


