ఎవరి రాత ఎట్లుందో..
కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
కౌంటింగ్కు 261 మంది సిబ్బంది
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో 92 వార్డులకు ఈ నెల 11న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించి భద్రపరిచారు. కాగా ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. ఉదయం 11 గంటల కల్లా పూర్తి ఫలితాలు వెలువడుతాయని భావిస్తున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలకు సంబంధించిన అన్ని వార్డుల ఓట్ల లెక్కంపు ఏకకాలంలో జరుగనుంది. కామారెడ్డిలో 49 వార్డులు ఉండడంతో మొదట 32 వార్డులను లెక్కించి, తరువాత మిగతా 17 వార్డులను లెక్కించనున్నారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆశిష్ సంగ్వాన్ పర్యవేక్షణలో నాలుగు చోట్ల ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఓటు లెక్కలు.. సీటు చర్చలు
పోలింగ్ ముగిసిన తరువాత ఆయా రాజకీయ పార్టీ ల నేతలు పోలైన ఓట్లు, పోలింగు సరళిపై చర్చించుకుని తమకు ఎన్ని వస్తాయో లెక్కలేసుకున్నారు. మెజారిటీ స్థానాలు దక్కితే చైర్మన్ పీఠం ఎవరికి ఇవ్వాలి, ఒకవేళ సరిపడా వార్డులు గెలుచుకోని పక్షంలో ఎవరి మద్దతు కూడగట్టుకోవాలన్న దానిపై చర్చోపచర్చలు చేస్తున్నారు. చైర్మన్ పీఠంపై కన్నేసిన పలువురు వార్డు సభ్యులు అప్పుడే ముఖ్య నేతలతో మంతనాలు మొదలుపెట్టారు. కొందరైతే ఎంత ఖర్చయినా పెట్టుకుంటామని తమకే అవకాశం ఇవ్వాలంటున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో ఆయా పార్టీల్లో ముందుగానే క్లారిటీతో ఉన్నారు. అయితే కామారెడ్డి మున్సిపల్కు సంబందించి చైర్మన్ అభ్యర్థి ఎవరన్నదానిపై ఏ పార్టీలోనూ స్పష్టత లేదు. గెలుపొందిన అభ్యర్థుల్లో నుంచి ఎంపిక చేయాలని భావిస్తున్నారు. అయితే ఒకరిద్దరు మహిళా కౌన్సిలర్లు ముందస్తుగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. క్విక్ రియాక్షన్ టీములు, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్, స్ట్రైకింగ్ ఫోర్స్ను సిద్ధం చేసి ఉంచారు. విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడం, ర్యాలీలు ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
ఓట్ల లెక్కింపు కోసం నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 261 మందిని నియమించారు. వీరిలో 87 మంది సూపర్వైజర్లు కాగా, 174 మంది అసిస్టెంట్లు ఉంటారు. కామారెడ్డిలో 49 వార్డులకు సంబందించి ఓట్ల లెక్కంపు కోసం 114 మంది, బాన్సువాడలో 63 మంది, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో 42 మంది చొప్పున నియమించారు. లెక్కింపు కోసం నియమించిన సిబ్బందికి పలు దఫాల్లో శిక్షణ ఇచ్చారు. బ్యాలెట్ పత్రాలు కావడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై అవగాహన కల్పించారు. కౌంటింగ్ ఏజెంట్ల సమయంలో ఓట్లను లెక్కిస్తారు.
మున్సిపాలిటీ వార్డులు కౌంటింగ్ కేంద్రం
కామారెడ్డి 49 ఏఎంసీ గోడౌన్ (జిల్లాపోలీసు కార్యాలయం)
ఎల్లారెడ్డి 12 మోడల్ డిగ్రీ కాలేజీ, ఎల్లారెడ్డి
బాన్సువాడ 19 ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీ, బాన్సువాడ
బిచ్కుంద 12 మార్కెట్ కమిటీ, బిచ్కుంద
నేడు మున్సిపల్ ఓట్ల లెక్కింపు
నాలుగు పట్టణాల్లో
కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి
ఏ పార్టీకి ఎన్ని సీట్లు
వస్తాయోననే ఉత్కంఠ
పుర పీఠంపై పలువురికి ఆశలు
ఎవరి రాత ఎట్లుందో..
ఎవరి రాత ఎట్లుందో..


