పోలింగ్ @ 69.48%
వార్డులవారీగా మొత్తం ఓటర్లు, పోలైన ఓట్ల వివరాలు..
పోలింగ్ సరళి ఇలా (ప్రతి రెండు గంటలకు)...
రేపు కౌంటింగ్.. ట్రాఫిక్ మళ్లింపు
జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్.. తర్వాత వేగం పుంజుకుంది. కలెక్టర్, ఎస్పీ తదితరులు పోలింగ్ స్టేషన్లను సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
బాన్సువాడలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న ఓటర్లు
జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి రెండు గంటల్లో ఓటర్లు పెద్దగా రాకపోవడంతో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఓటర్లు పోటెత్తారు. తర్వాత కంటిన్యూగా వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, సబ్కలెక్టర్ కిరణ్మయి, ఏఎస్పీ చైతన్య తదితరులు ఆయా ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
పలు వార్డుల్లో ఘర్షణ..
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
● జిల్లా కేంద్రంలోని 8వ వార్డులోని ఆర్అండ్బీ పోలింగ్కేంద్రం వద్ద దొంగ ఓట్ల విషయంలో గొడవ జరిగింది. ఇతర మండలాల నుంచి వచ్చిన వ్యక్తులు ఓటు వేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.
● 9వ వార్డులోని ఎస్ఆర్కే కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. బీజేపీ వాళ్లే దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ గొడవలో ప్రత్యర్థులు రాళ్లు రువ్వడంతో బీజేపీ కార్యకర్త శ్యాంరెడ్డి తలకు గాయమయ్యింది.
● 24 వ వార్డులోని 73, 74, 75 పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్లకు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంచుతున్నారంటూ మిగతా పార్టీలకు చెందిన వారు ఆందోళనకు దిగారు. ఓటర్ల ఫోన్ నంబర్లు తీసుకుని యూపీఐ ద్వారా నగదు బదిలీ చేస్తున్నట్లు గుర్తించిన ఇతర పార్టీల నేతలు పోలీసులను, అధికారులను నిలదీశారు. దీంతో సదరు అభ్యర్థి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ఆందోళనకారులు శాంతించకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో అరగంట పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
● 46, 47 వార్డులలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
● ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు తిరుగుతుంటే అడ్డుకోవలసిన పోలీసులు సహకరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు వారినందరినీ అరెస్టు చేసి నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
● బాన్సువాడలోని 9వ వార్డులో కాంగ్రెస్కు ఓటేయాలని ఓ కానిస్టేబుల్ చెప్పారని బీజేపీ నాయకులు ఆరోపించారు. 18 వ వార్డులో దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తున్నవారిని బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 92 వార్డులుండగా.. 447 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నోటిఫికేషన్ వెలువడకముందే ఆశావహులు ప్రచారం మొదలుపెట్టారు. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక ప్రచారాన్ని ఉధృతం చేశారు. విజయం కోసం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధాన పార్టీ లతో పాటు కొన్ని వార్డుల్లో స్వతంత్య్ర అభ్యర్థులు కూడా అడ్డగోలుగా ఖర్చు చేశారు. వారి భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది.
అందరిలోనూ గెలుపు ధీమా
పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు, పార్టీల నేతలు ఓట్ల లెక్కలు వేసుకున్నారు. పోలైన ఓట్లలో ఎవరి ఓట్లు తమకు వస్తాయో, ఎవరి ఓట్లు రావో అంచనాలు వేసుకున్న అభ్యర్థులు.. చాలామంది గెలుపు ధీమాలో ఉన్నారు. 15న వారి భవితవ్యం తేలనుంది.
బల్దియా వార్డులు మొత్తం ఓటేసిన ఓటేసిన ఓటేసిన పోలయిన
ఓటర్లు పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం ఓట్లు
కామారెడ్డి 49 99,313 30,822 34,653 08 65,483
ఎల్లారెడ్డి 12 13,265 5,110 5,470 01 10,581
బాన్సువాడ 19 24,188 8,540 9,272 06 17,818
బిచ్కుంద 12 12,759 4,921 5,092 01 10,014
మొత్తం 92 1,49,525 49,393 54,487 16 1,03,896
బల్దియా పోలింగ్ కేంద్రాలు 9 గంటలు 11 గంటలు 1 గంట 3 గంటలు 5 గంటలు
కామారెడ్డి 152 3.69 23.87 43.79 56.03 65.94
ఎల్లారెడ్డి 24 8.91 30.60 52.92 69.16 79.77
బాన్సువాడ 39 9.49 30.68 50.51 64.43 73.66
బిచ్కుంద 24 14.34 38.98 60.69 71.82 78.49
మొత్తం 239 6.00 26.86 47.13 59.90 69.48
కామారెడ్డి టౌన్ : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజున జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రొబెల్స్ స్కూల్ నుంచి అడ్లూరు వెళ్లే మార్గంలో కలెక్టర్ ఆఫీస్ మూల మలుపు నుంచి వాహనాలకు అనుమతిలేదన్నారు. అలాగే రామారెడ్డి రోడ్డులోని గుమస్తా కాలనీ మూలమలుపు నుంచి కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ ఆఫీస్ ముందున్న 100 ఫీట్ల రోడ్డులోనూ రాకపోకలను పూర్తిగా నిలిపివేశామన్నారు. కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి అడ్లూరు–పోసానిపేట వరకు, కామారెడ్డి నుంచి గర్గుల్ –రామారెడ్డి వైపు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, వాహనాలు యథావిధిగా వెళ్లవచ్చని పేర్కొన్నారు.
మందకొడిగా ప్రారంభమై..
ఊపందుకున్న పోలింగ్
బిచ్కుంద బల్దియాలో అత్యధికం..
జిల్లాకేంద్రంలో అత్యల్పం..
జిల్లాలో చెదురుమదురు సంఘటనలు
పోలింగ్ @ 69.48%
పోలింగ్ @ 69.48%


