పట్టణ ఓటర్లలో తగ్గుతున్న చైతన్యం
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లేసేందుకు ఊరూరా జనం పోటెత్తగా.. బుధవారం జరిగిన బల్దియా పోరులో పట్టణ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. గతంలో పోల్చినా ఈసారి తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యింది. 2020 నాటి మున్సిపల్ ఎన్నికలలో మూడు మున్సిపాలిటీల పరిధిలో సగటు పోలింగ్ శాతం 70.73 శాతం నమోదవగా.. ఈసారి 69.48 శాతానికి తగ్గింది.
జిల్లాకేంద్రంలో మరీ తక్కువగా..
కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి క్రితం సారి ఎన్నికల్లో 67.53 శాతం పోలింగు నమోదయ్యింది. ఈసారి ఓటర్లు మరింత బద్ధకించడంతో అది 65.94 శాతం వద్దే ఆగిపోయింది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో 80.35 శాతం మంది ఓటేస్తే ఈసారి 79.77 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాన్సువాడలో గతంలో 77.03 శాతం పోలింగ్ రికార్డు కాగా.. ఈసారి 73.66 శాతం మంది ఓటేశారు. మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తర్వాత మొదటిసారి బిచ్కుందలో జరిగిన ఎన్నికల్లో 78.49 శాతం పోలింగ్ నమోదయ్యింది.


