అక్రమాలపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు
కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవులు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. బిచ్కుందలో స్థానిక ఎమ్మెల్యే స్వయంగా ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారని, వార్డుల్లో మద్యం, మటన్ విందులు భారీగా సాగుతున్నాయని ఆరోపించారు. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే బిచ్కుందకు ప్రత్యేక అధికారిని నియమించి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు.
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని పెద్ద టాక్లీ శివారులో కుక్కల దాడిలో మంగళవారం జింకకు తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ శివారులో జింకను కుక్కలు చుట్టుముట్టి కరిచాయి. గమనించిన గ్రామస్తులు కుక్కలను తరమికొట్టి జింకకు సపర్యలు చేసి కాపాడారు. జింకకు గాయాలైన విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు ప్రథమ చికిత్స చేసి తీసుకెళ్లారు.
పిట్లం(జుక్కల్): బుర్నాపూర్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నున్న స్థలాన్ని, కమ్యూనిటీ భవనాన్ని కబ్జా కాకుండా చూడాలని కోరుతూ ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు.. తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆ స్థలంలోకి రాకుండా బుర్నాపూర్ సర్పంచ్ కంచె వేయించారని ఆరోపించారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టెంకి బాల్ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మడి స్వామి, రాజు, నేతలు బట్ట రాజు, కనగాళ్ల రాములు, లక్ష్మణ్, బి. ప్రకాష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఎంపీడీవో నరేష్ సూచించారు. మంగళవారం ఆయన కన్నాపూర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేయాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. సర్పంచ్ సంజీవులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
అక్రమాలపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు
అక్రమాలపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు


