నేటితో ప్రచారానికి తెర
11న పోలింగ్..
● తుది అంకానికి చేరుకున్న
అభ్యర్థుల ప్రచారం
● సాయంత్రం 5 గంటలకు
మూగబోనున్న మైకులు
● గెలుపు కోసం తెర వెనుక వ్యూహాలు
మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం తుది అంకా నికి చేరుకుంది. నేడు సోమ వారం సాయంత్రంతో బ హిరంగ ప్రచారానికి తెరపడనుంది. మైకులు మూగబోనున్నాయి. గెలుపు కో సం 9, 10వ తేదీల్లో అంతర్గతంగా చక్రం తిప్పేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేయనున్నారు. గెలుపు ఓటములను నిర్ణయించే కీలకమైన 11వ తేదీ పోలింగ్కు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
బహిరంగ ప్రచారానికి స్వస్తి..
బహిరంగ ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో, చివరి నిమిషంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించొద్దని అధికారులు స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు నియోజకవర్గాలను వీడాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రలోభాలకు సిద్ధం..
ప్రచార గడువు ముగియడంతో 9, 10వ తేదీల్లో ప్రధాన పార్టీలు, స్వతంత్రులు తమ గెలుపు కోసం తెర వెనుక వ్యూహాలతో చక్రం తిప్పనున్నారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలవడం, సామాజిక వర్గాల వారీగా మంతనాలు జరపనున్నారు. కాగా, పోలింగ్కు ఒకరోజు ముందు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు పలువురు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలలో ప్రధాన పార్టీ ల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. అగ్రనేతల రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో పట్టణాలు హోరెత్తాయి. నాలుగు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యేలు అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుందలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారం నిర్వహించారు.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 1,49,525 ఓటర్లు ఈ నెల 11న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిపేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.


