కామారెడ్డి రూపురేఖలు మారుస్తాం
కామారెడ్డి టౌన్: బీజేపీని గెలిపిస్తే రాబోయే మూడేళ్లలో కామారెడ్డి రూపురేఖలు మారుస్తామని స్థానిక శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన వివిధ వార్డులలో బీజేపీ అభ్యర్థులతో కలిసి కార్నర్ మీటింగ్ సభలో ప్రసంగించారు. అవినీతి రహిత, పారదర్శకమైన పాలన అందిస్తామన్నారు. గెలిచిన బీజేపీ కౌన్సిలర్లు రూపాయి అవినీతికి పాల్పడినా వెంటనే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతానని బహిరంగంగా ప్రకటించారు. కామారెడ్డిలో ఆ ప్రధాన పార్టీలు రెండు ఒక్కటేనని, ప్రజలను దోచుకోవడమే వారి ప్రధాన ఎజెండా అని ధ్వజమెత్తారు. ఆ పార్టీలో ఏ అభ్యర్థులు గెలిచినా అంతర్గతంగా అవినీతికి పాల్పడుతూ, కబ్జాలు, అక్రమాలతో దోపిడీకి పాల్పడతారని విమర్శించారు. ఆ రెండు పార్టీలు కలిసి అవిశ్వాసం పెట్టి బీఆర్ఎస్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిని గద్దె దించి ఎవరికి దక్కించారో అందరికీ తెలుసన్నారు. సొంత పార్టీ కౌన్సిలర్లే వెన్నుపోటు పోడిచారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని రాజకీయాలు కామారెడ్డి మున్సిపల్లో జరుగుతాయని, అభివృద్ధికి ఆటంకం కలిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఆదాయం మార్గాలు పెంచి, రోడ్ల విస్తరణ, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, పార్కింగ్ స్థలాలు, పచ్చదనంతో పురాన్ని అభివృద్ధి చేసుకుందామని, అందుకోసం బీజేపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని ఓటర్లను కోరారు.
బీజేపీ కౌన్సిలర్లు అవినీతికి
పాల్పడితే వేటు వేస్తాం
ఆ రెండు పార్టీలు ఒకటే..
దోపిడీయే వారి ఎజెండా
ఎమ్మెల్యే కాటిపల్లి
వెంకటరమణారెడ్డి విమర్శలు


