యూరియా ‘యాప్’ తప్పనిసరి
● ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
● స్మార్ట్ ఫోన్లతో రైతుల ఆపసోపాలు
● యూరియా కోసం
గోదాముల వద్ద బారులు
నిజాంసాగర్(జుక్కల్): రైతులు యూరియా బస్తాలు పొందడానికి యాప్ బుకింగ్ విధానం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొన్నటి వరకు పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు యూరియాను అందజేయగా, ఆదివారం యాప్ విధానం అమలు చేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికి స్మార్ట్ఫోన్లు లేకపోవడం, మరికొందరికి ఫోన్లు ఉన్నా బుకింగ్ విధానం తెలియక సతమతమయ్యారు.
అవాక్కయిన రైతులు, సిబ్బంది..
నిజాంసాగర్ మండల కేంద్రంలోని అచ్చంపేట సొసైటీ గోదాముకు శనివారం సాయంత్రం లారీలో 444 యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు గోదాము వద్దకు చేరుకొని రాత్రి అక్కడే పడుకున్నారు. ఆదివారం ఉదయం యూరియా పంపిణీ చేసేందుకు సొసైటీ సిబ్బంది సిద్ధం కాగా, అధికారులు యాప్లో నమోదు తప్పనిసరి అని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికే బస్తాలు పంపిణీ చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో రైతులు స్మార్ట్ఫోన్లు తెచ్చుకొని సొసైటీ సిబ్బందికి ఇవ్వడంతో యాప్ నమోదు ప్రక్రియ చేపట్టారు. అనంతరం ఎకరానికి ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. కాగా, యాప్లో బుకింగ్ చేసుకున్నా, కొందరు రైతులకు యూరియా అందక నిరాశతో వెనుదిరిగారు.
యూరియా ‘యాప్’ తప్పనిసరి


