
పోలీసుల కాల్పుల్లో రియాజ్ హతం
డీజీపీ పరామర్శ..
నిజామాబాద్ అర్బన్ : కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడైన పాత నేరస్తుడు షేక్ రియాజ్ సోమవారం పోలీసు కాల్పుల్లో మృతి చెందిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్, ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కొని ఫైర్ చేయడానికి ప్రయత్నించిన క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. నగరంలోని హస్మికాలనీకి చెందిన రియాజ్కు వాహనాల దొంగతనాలు , చైన్స్నాచింగ్లు చేయడం అలవాటుగా మారింది. అతనిపై 40 పైగా కేసులు నమోదు అయ్యాయి. పాత కేసుల విచారణలో భాగంగా సీసీఎస్ పోలీసులు రియాజ్ను అదుపులోకి తీసుకున్న తరువాత ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్యచేసి పారిపోయిన రియాజ్ కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు జల్లెడ పట్టాయి. సారంగపూర్ వద్ద అరెస్టు చేసి రియాజ్ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రియాజ్కు ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తులోని 407 గదిలో చికిత్స అందించారు. అనంతర పరిణామ ఘటనల్లో రియాజ్ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. పంచనామా, పోస్టుమార్టం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృత దేహాన్ని అందించగా మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు పకడ్బందీగా వ్యవహరించారు.
బాణాసంచా కాల్చి..
షేక్ రియాజ్ పోలీసు కాల్పుల్లో మరణించాడని తెలిసిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రి ముందు బీజేపీ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కొందరు బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. మూడవ టౌన్, ఆర్మూర్ పోలీస్స్టేషన్, ఇతర ఠాణాల్లో పోలీసులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరి కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మెడికల్ రిప్రంజెంటేటివ్లు ప్రమోద్ చిత్రపటానికి నివాళులర్పించారు.
పాత నేరస్తుడు రియాజ్ మృతిపై హర్షం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు
ఏఆర్ కానిస్టేబుల్ నుంచి
తుపాకీ లాక్కున్న నిందితుడు
ఫైర్ చేసేందుకు ప్రయత్నం..
ఎదురు కాల్పులు జరిపిన పోలీసులు
హతుడి పై కానిస్టేబుల్ హత్య కేసు,
గతంలో 40 పైగా చైన్ స్నాచింగ్,
వాహనాల దొంగతనాల కేసులు
సంచలనం రేపిన
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన
ఆస్పతి ఎదుట, ఠాణాల్లో
బాణాసంచా కాల్చి సంబురాలు

పోలీసుల కాల్పుల్లో రియాజ్ హతం