
సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణికి 73 వినతులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 73 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పింఛన్ల మంజూరు, రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి
వెంచర్లో గ్రామ పంచాయతీకి వదిలిపెట్టాల్సిన ఓపెన్ ల్యాండ్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని భిక్కనూర్కు చెందిన గంగల రవీందర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. భిక్కనూరు జీపీకి చెందిన ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.