
ఖలీల్వాడి : ఏటా బస్సుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాటి స్థానంలో అద్దెబస్సులను నడుపుతోంది. ఐదేళ్లలో అద్దె బస్సుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిజామాబాద్ రీజియన్లోని ఆరు డిపోలలో ఆర్టీసీ బస్సులతో పోల్చితే 40 శాతానికి పైగా అద్దె బస్సులు ఉన్నాయి.
ఖర్చులు తగ్గుతాయ్..
ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారం పడుతుంది. దీంతో పాత బస్సుల స్థానంలో కొత్తవి కాకుండా అద్దె బస్సుల వైపు మొగ్గుచూపుతోంది. అద్దె బస్సులతో సంస్థకు కొంత వరకు ఖర్చులు తగ్గుతాయి. కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఇటీవల రీజియన్కు 25 నుంచి 30 లగ్జరీ బస్సులు కొత్తవి వచ్చాయి. రీజియన్లోని అన్ని డిపోల్లో మొత్తం 615 బస్సులు ఉన్నాయి. ఇందులో 426 బస్సులు ఆర్టీసీవి కాగా, 189 అద్దెబస్సులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 15 సంవత్సరాలు దాటిన వాహనాలను స్క్రాప్ కింద పరిగణించాలని నిర్ణయించింది. కాగా ఆర్టీసీ సొంత బస్సుల్లో దాదాపు 50 వరకు గడువు తీరినవి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రీజియన్ పరిధిలో అద్దెబస్సుల కోసం ఆర్టీసీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 2023 సంవత్సరం నుంచి ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సులు తగ్గుతూ వస్తున్నాయి. అద్దె బస్సుల సంఖ్య పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్టీసీ బస్సులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అంటున్నారు. ఇందన భారం తగ్గించుకోవడం, పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ సమాయత్తం అవుతుంది. వాటిని కూడా టెండర్ విధానంలో అద్దె ప్రాతిపదికన నడపాలని నిర్ణయించినట్లు సమాచారం. సంస్థకు సంబంధించిన బస్సును నడపాలంటే డీజిల్ (కిలోమీటరుకు రూ. 18) డ్రైవర్, కండక్టర్, టైర్లు, ఆయిల్, ఇతర నిర్వహణ ఖర్చులు ఉంటాయి. అద్దె వాహనాలైతే కిలోమీటరకు ఒక ధర నిర్ణయించి చెల్లిస్తారు. డ్రైవర్, జీతం, ఇతర ఖర్చులన్నీ బస్సు యాజమానే భరించాల్సి ఉంటుంది. ఇది ఆర్టీసీకి కలిసి వచ్చే అంశంగా మారింది. కాగా అద్దె బస్సుల యాజమానులు మంచి రహదారులు, ట్రాఫిక్ సమస్యలు లేని రూట్లలో నడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక లాభాల రూట్ల వైపు అద్దెబస్సులు వెళ్తుతున్నాయి. తక్కువ ఆదాయం ఉన్న వైపు ఆర్టీసీ బస్సులను పంపిస్తున్నారు.
ఇప్పటికే రీజియన్ పరిధిలో 189 బస్సులు
ఆర్థిక నష్టాలను అధిగమించేందుకే..