తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.27.16,159 ఆదాయం లభించిందని లోవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి.విశ్వనాథరాజు తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తూండటంతో దేవస్థానంలో హుండీలను సోమ వారం తెరచి నగదు, కానుకలు లెక్కించారు. మొత్తం 35 రోజులకు గాను నోట్ల రూపంలో రూ.25,12,560, నాణేలు రూ.2,03,599, బంగారం 11.100 గ్రాములు, వెండి 672 గ్రాములు వచ్చాయని ఈఓ వివరించారు. ఎంఎస్ఎన్ ఛారిటీస్ సహాయ కమిషనర్ సీహెచ్ సురేష్నాయుడు పర్యవేక్షణలో హుండీల ఆదాయం లెక్కించామన్నారు. నగదు లెక్కింపులో శ్రీవారి సేవకులు, బ్యాంకు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
పీజీఆర్ఎస్కు 534 అర్జీలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవా రం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 534 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, ఆన్లైన్లో భూమి వివరాల నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్యం, సంక్షేమ పథకాలు లబ్ధి వంటి అంశాలపై అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, అర్జీలను గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
మరిడమ్మ తల్లికి
రూ.7.20 లక్షల ఆదాయం
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మరిడమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.7,20,433 ఆదాయం వచ్చినట్లు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ కె.విజయలక్ష్మి తెలిపారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చింతపల్లి శ్రీహర్ష ఆధ్వర్యాన హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. గత ఏడాది డిసెంబరు 24 నుంచి ఈ నెల 30 వరకూ మొత్తం 95 రోజులకు గాను అమ్మవారి హుండీల ద్వారా రూ.6,40,303, అన్నదాన హుండీ ద్వారా రూ.80,130 వచ్చాయని ఈఓ వివరించారు. హుండీల ఆదాయాన్ని ట్రస్టు బోర్డు, భక్త మండలి సభ్యులు లెక్కించారు. పెద్దాపురం గ్రూప్ టెంపుల్స్ ఈఓ కె.జగదీశ్వరరావు, వీఆర్ఓలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్వేది స్వామికి రూ.37,08,338 రాబడి
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. భక్తుల నుంచి కానుకలుగా మొత్తం రూ.37,08,338 ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 30 వరకూ 53 రోజులకుగాను పై ఆదాయం వచ్చింది. మొత్తం ఆదాయంలో మెయిన్ హుండీల ద్వారా రూ.35,93,457 ఆదాయం, గుర్రాలక్క ఆలయ హుండీల ద్వారా రూ.27,872, అన్నదాన హుండీల ద్వారా రూ.87,009 చొప్పున సమకూరినట్టు ఈవో ఎంకేటీఎన్వీ ప్రసాద్ వివరించారు.


