సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కార్పొరేట్ కంపెనీల లాభాలు కోసమే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకు వచ్చిందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మండిపడ్డారు. లేబర్ కోడ్లను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె చేస్తున్నామని చెప్పారు. సమ్మె వాల్పోస్టర్ను స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టేందుకే మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. కార్మికులు 150 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులన్నింటినీ కేంద్రం కాలరాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లు అమలు జరిగితే సంఘం పెట్టుకోవడానికి, సమ్మె చేయడానికి, బేరసారాలాడే హక్కు, ఉద్యోగ భద్రత వంటివి రద్దవుతాయన్నారు. కార్మికుడు జీవితాంతం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే పని చేయాల్సి ఉంటుందని, పింఛను భద్రత లేకుండా చేయడమే లేబర్ కోడ్ల లక్ష్యమని వివరించారు. ఎనిమిది గంటల పని స్థానంలో అదనపు పని గంటల పేరుతో గొడ్డు చాకిరీ చేయించుకుంటారని, పగలే భద్రతలేని పరిస్థితులలో మహిళలతో రాత్రి వేళల్లో పని చేయించాలని అనుకోవడం అత్యంత ప్రమాదకరమని చెప్పారు. శ్రామికుల ప్రయోజనాలను దెబ్బ తీసే లేబర్ కోడ్లను నిరసిస్తూ ఫిబ్రవరి 12న నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, మోదీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను తిప్పికొట్టాలని నర్సింగరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషుబాబ్జీ, చెక్కల రాజ్కుమార్, కోశాధికారి మలకా రమణ తదితరులు పాల్గొన్నారు.
ఫ కార్పొరేట్ల లాభాల కోసమే లేబర్ కోడ్లు
ఫ సీఐటీయూ రాష్ట్ర నేత
సీహెచ్ నర్సింగరావు


