చోరీ కేసులో ముగ్గురికి జైలు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో ముగ్గురికి జైలు

Jan 7 2026 7:52 AM | Updated on Jan 7 2026 7:52 AM

చోరీ కేసులో ముగ్గురికి జైలు

చోరీ కేసులో ముగ్గురికి జైలు

జగ్గంపేట: బంగారం చోరీ కేసులో ముగ్గురికి 12 నెలల జైలు, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ పెద్దాపురం సివిల్‌ జడ్డి, జ్యుడీషియిల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఐ.దేవీరత్న కుమారి మంగళవారం తీర్పు ఇచ్చారు. ఎస్సై రఘునాఽథరావు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేట శివారు యానాదుల కాలనీలో నివసించే ఎద్దుపాటి శ్రీనివాస్‌ 2025 ఫిబ్రవరి 26వ (శివరాత్రి)తేదీ తెల్లవారుజామున తన ఇంటికి తాళం వేసి గోనాడ గ్రామంలోని ఏలేరు కాలువలో స్నానానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికీ ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా, ఇంటిలోని 20 గ్రాముల బంగారం మాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుడ్ల సతీష్‌, తమ్మిశెట్టి సాయి, బొండపల్లి అచ్యుత సతీష్‌ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. విచారణలో వారు నేరం చేసినట్టు రుజువు కావడంతో పైవిధంగా న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు.

104 కిలోల గంజాయి స్వాధీనం

తొండంగి: ఒడిశా, విశాఖ ఏజెన్సీ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న గంజాయిని జాతీయ రహదారిపై బెండపూడి వై.జంక్షన్‌ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా కేరళకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి, 104 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తుని రూరల్‌ సీఐ చెన్నకేశవరావు, తొండంగి ఎస్సై జగన్మోహనరావు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేస్తుండగా, ఓ లారీపై గంజాయిని గుర్తించారు. దాని డ్రైవర్‌ కేరళ రాష్ట్రం కన్నూర్‌ జిల్లా పుతాపరాకు చెందిన పుడియపురల్‌ సమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరికి సంబంధించిన ఓ కారును కూడా అదుపులోకి తీసుకున్నారు. దానిలో కేరళ రాష్ట్రం ఎర్నాకులం నావెల్‌ ఆర్నమెంట్‌ నదపొలువకు చెందిన కేపీ సలీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 104 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, లారీ, కారును సీజ్‌ చేశారు. గంజాయి విలువ రూ. 52 లక్షలు ఉంటుందని, దీనిపై ఎన్‌డీపీఎస్‌ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

ట్రైబల్‌ క్రీడలకు

8న జట్ల ఎంపిక

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా సెంట్రల్‌ స్కీం పథకంలో భాగంగా ట్రైబల్‌ క్రీడాకారుల్లో నైపుణ్యాలు వెలికితీసేందుకు మొదటిసారిగా ఖేలో ఇండియా ట్రైబల్‌ క్రీడలు పేరుతో జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. డీఎస్‌డీఓ వి.సతీష్‌ కుమార్‌ మంగళవారం ఈ విషయం తెలిపారు. పురుషులు, మహిళలకు ఓపెన్‌ కేటగిరిలో అథ్లెటిక్స్‌, ఆర్చరీ, స్విమ్మింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, హాకీ, ఫుట్‌బాల్‌ పోటీలు జరుగుతాయన్నారు. వీటిని జిల్లాలో అర్హులైన ట్రైబల్‌ క్రీడాకారులను ఎంపికను గురువారం డీఎస్‌ఏలో ఎంపిక నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి కలవారు ఆ రోజు ఉదయం 9 గంటలకు డీఎస్‌ఏలో రిపోర్టు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement