పద్యంలా ఘోషించే గోదావరి!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదావరి తీరం తెలుగు శతక పద్య పఠనంతో, వందేమాతరం గీతాలాపనతో మారు మోగింది. 1,008 మంది విద్యార్థులతో గోదావరి గట్టు చాంబర్ భవనంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగు బాల శతక పద్య సహస్రాధిక గళ ధారణ, దశ సహస్ర వందేమాతర గీతాలాపన కార్యక్రమాలు జరిగాయి. మాతృ భాష పరిరక్షణ సమితి పెరవలి, ఆంధ్ర కేసరి యువజన సమితి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమాలు నిర్వహించారు. 40 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు భారతమాత, తెలుగు తల్లి వేషధారణలతో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి జంధ్యాల పాపాయ్య శాస్త్రి (కరుణశ్రీ) కుమారుడు వెంకట రమణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 80 ఏళ్లు జీవించిన తన తండ్రి 80 తెలుగు సాహితీ గ్రంథాలను అందించారని ఆయన తెలిపారు. ఎక్కువ శాతం తెలుగు బాల సాహిత్య గ్రంథాలనే అందించిన ఘనత కరుణశ్రీ దే అన్నారు. శాసనమండలి సభ్యులు సోమ వీర్రాజు మాట్లాడుతూ 150 ఏళ్ల వందే మాతర గీతాన్ని వెయ్యి సార్లు ఆలపించడం ఆనందదాయకమన్నారు. నగర ప్రముఖులు తోట సుబ్బారావు, పంతం కొండలరావు, ఇయ్యపు మురళీధర్, లక్కోజు వీరభద్రరావు అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్ర కేసరి యువజన సమితి ప్రతినిధులు మాదిరాజు శ్రీనివాస్, దేశిరెడ్డి బలరామనాయుడు, తెలుగు ఉపాధ్యాయురాలు డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి తెలుగు శతక పద్య విశిష్టతను వివరించారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి కుమారుడు వెంకటరమణకు ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కారం చేశారు.


