
రాజమహేంద్రవరం – కాకినాడ మధ్య స్పెషల్ రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం – కాకినాడ పోర్టు మధ్య ప్రతి రోజు అన్ రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అఽధికారులు మంగళవారం ప్రకటించారు. కాకినాడ పోర్టు – రాజమహేంద్రవరం (07523) రైలు ఈ నెల 15 నుంచి, రాజమహేంద్రవరం – కాకినాడ పోర్టు (07524) రైలు ఈ నెల 16 నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. ఇవి రాజమహేంద్రవరం, ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, మేడపాడు, సామర్లకోట, కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్లలో ఆగుతాయని వివరించారు. ఒక రైలు రాజమహేంద్రవరంలో తెల్లవారుజాము మూడు గంటలకు బయలుదేరి 4.40 గంటలకు కాకినాడ పోర్టు చేరుకుంటుందన్నారు. మరో రైలు కాకినాడలో ఉదయం 6.15 గంటలకు బయలుదేరి 8.15 గంటలకు రాజమహేంద్రవరం వస్తుందన్నారు.
పింక్ మూన్తో
‘నన్నయ’ ఒప్పందం
రాజానగరం: పింక్ మూన్ టెక్నాలజీ సంస్థతో ఆదికవి నన్నయ యూనివర్సిటీకి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. దీనికి సంబంధించిన పత్రాలపై మంగళవారం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, టెక్నాలజీ సంస్థ సీఈఓ టి.నాగమల్లేశ్వరరావు సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా యూనివర్సిటీలోని అన్ని ఐటీ, సాఫ్ట్వేర్ ప్రక్రియలకు సాంకేతిక మద్దతు, కన్సల్టెన్సీ, పరిష్కారాలు అందిస్తుందన్నారు.
వివాహిత అదృశ్యం
పెరవలి: ఖండవల్లి గ్రామానికి చెందిన వనచెర్ల రాంబాబు, లక్ష్మి దంపతుల కుమార్తె పెచ్చెట్టి జ్యోత్స్న (19) అదృశ్యమైంది. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోత్స్నకు ఈ ఏడాది ఏప్రిల్ 23న వివాహం జరిగింది. వినాయక చవితి పండగకు పుట్టింటికి వచ్చి, ఇక్కడే ఉంది. ఈ క్రమంలో ఈ నెల 8న తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి, ఉదయం 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. కానీ ఇంట్లో జ్యోత్స్న కనిపించలేదు. బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా, ఫలితం లేకపోవడంతో ఆమె తల్లి.. పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఆచూకీ తెలిసే 94407 96642కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

రాజమహేంద్రవరం – కాకినాడ మధ్య స్పెషల్ రైళ్లు