గద్వాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకోవాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన వైద్య, ఆరోగ్యశాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు. తాను ఇటీవల జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులన ఆకస్మికంగా సందర్శించి.. వివిధ సమస్యలను గుర్తించినట్లు చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పాత ఫైల్స్ క్లియరెన్స్ చేయాలన్నారు. అలాగే ఉపయోగం లేని ఫర్నీచర్ను తీసేయాలని ఆదేశించినా చాలాచోట్ల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధికారులు బాధ్యతాయుతంగా పనిచేయకున్నా.. అదేవిధంగా అనుమతి లేకుండా గైర్హాజరు అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని పీహెచ్సీలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు తప్పనిసరి చేయాలన్నారు. యంత్రాల్లో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకుని వినియోగించాలన్నారు. ఆయా ఆస్పత్రులో వివిధ రిజిస్టర్ల నిర్వహణ, వ్యాక్సినేషన్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు. ఆస్పత్రుల వైద్యాధికారులు తమ సమీపంలో సబ్సెంటర్లు, ఇతర క్యాంపులకు వెళ్లినప్పుడు ముందుస్తుగా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఎన్సీడీ స్క్రీనింగ్తోపాటు ఇతర కార్యక్రమాలన్నీ వందశాతం విజయవంతం చేసేలా పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా నుంచి వైద్యసేవలకు చాలామంది కర్నూలు ఆస్పత్రులకు వెళ్తున్నారని, ఈ పరిస్థితి పూర్తిగా మారాలని, ఇందుకోసం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. అలాగే 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి శనివారం వరకు వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల గురించి డీఎంహెచ్ఓ కిరణ్మయి వివరించారు.


