● ఏప్రిల్లో బియ్యం పంపిణీకి ఏర్పాట్లు
● వేసవిలో ప్రజలకు తప్పనున్న ఇక్కట్లు
● ఇప్పటికే దుకాణాలకు
చేరుతున్న సన్నబియ్యం
● అధిక మొత్తంలో దిగుమతికి డీలర్ల తంటాలు
నిల్వకు ఇబ్బంది..
నెలవారీ కోటా బియ్యాన్ని ప్రతినెలా వారం నుంచి పదిరోజుల సమయంలో లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఒకేసారి మూడునెలలకు సంబంధించిన కోటా బియ్యాన్ని సరఫరా చేయాల్సి రావడంతో డీల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మూడు నెలలకు సరిపడా కోటా బియ్యం నిల్వచేసేందుకు అవసరమైన స్థలం లేకపోవడంతో డీలర్లకు తలనొప్పిగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంగా గ్రామ పంచాయతీ, ప్రభుత్వ భవనాల్లో బియ్యాన్ని నిల్వ చేయాలని ఆలోచిస్తున్నారు.
గద్వాల: వేసవిలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా.. రాబోయే రబీ సీజన్లో ధాన్యం నిల్వలకు వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగా వచ్చే నెలలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను ఒకేసారి ఇవ్వనుంది. మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశాల్లో పేర్కొనడంతో ఆ దిశగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూడు నెలలకు సంబంధించి 12,534 మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాలో పంపిణీ చేయనున్నారు.
ఏప్రిల్ 1 నుంచి 30 వరకు..
జిల్లాలోని 17 మండలాల్లో మొత్తం 335 చౌకధర దుకాణాలు ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏప్రిల్ నెల మొత్తం పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యం కోటాను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం రేషన్కార్డు లబ్ధిదారుడు మూడుసార్లు బయోమెట్రిక్ పెట్టాల్సి ఉంటుంది. ఒక రేషన్కార్డు దారుడు వరుసగా రెండు, మూడుసార్లు వేలిముద్రలు స్వీకరించే అవకాశం పీఓఎస్లో లేదు. ఈ లెక్కన రేషన్కార్డుదారులు చౌకధర దుకాణాల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ ఇబ్బందులను తొలగించేలా కేంద్రం పీఓఎస్లో ఏమైనా మార్పులు తీసుకొస్తుందో వేచిచూడాలి.
సన్నబియ్యానికి డిమాండ్..
గతంలో రేషన్కార్డుదారులకు ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేసేది. ఈ క్రమంలో రేషన్కార్డుదారులు 75– 80 శాతం లబ్ధిదారులు మాత్రమే రేషన్బియ్యం తీసుకునేవారు. అయితే ప్రభుత్వం రేషన్కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. గతంలో 80 శాతం మాత్రమే తీసుకునే రేషన్కార్డుదారులు అయితే సన్నబియ్యం వచ్చేసరికి 95 శాతానికి పైగా తీసుకుంటున్నారు. పైగా బియ్యం కూడా నాణ్యతగా ఉండటంతో సన్నబియ్యంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లాలోని చౌకధర దుకాణాలన్నీ రేషన్కార్డు దారులతో బారులు తీరడం కనిపిస్తున్నాయి.
మూడు నెలలకు
అవసరమైన బియ్యం 12,534 మె.ట.,
నెలవారీగా పంపిణీ
చేసే బియ్యం
4,178
మె.ట.,
పంపిణీకి చర్యలు..
ప్రభుత్వం ఆదేశాల మేరకు వేసవిలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల సౌకర్యం కోసం ఏప్రిల్ నెలలోనే ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నాం. ఆహారభద్రత కార్డు ఉన్న ప్రతిఒక్కరికి మూడు నెలల రేషన్బియ్యం అందిస్తాం.
– లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్


