గద్వాల క్రైం: జాతీయ లోక్ అదాలత్ విజయవంతంలో పోలీసుశాఖ కృషి ఎంతో కీలకంగా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవికుమార్ అన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేసి మాట్లాడారు. న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా విధుల నిర్వహణలో పోలీసుశాఖ సహకారం ఎంతగానో దోహదపడుతుందన్నారు. పోలీసులు కేవలం భదత్ర కల్పించడమే కాకుండా ప్రజలకు న్యాయం అందించడంలోనూ భాగస్వాములుగా ఉన్నారన్నారు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో లేకుండా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం కల్పిస్తూ వారి సమయం, డబ్బులు ఆదా చేయడం జరిగిందన్నారు. భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిఒక్కరు సహకారం అందించాలని కోరారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నిందితులకు శిక్ష పడేలా న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వడం ఎంతో శుభదాయకంగా ఉందన్నారు. ఇటీవల వివిధ విపత్కర కేసులను పునఃపరిశీలించి శిక్షలు వేయడంతో పోలీసు శాఖ ఎంతో ఆమోదయోగ్యమైన సేవలు చేసిందన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీనివాస్, లక్ష్మి, పూజిత, ఉదయ్నాయక్, ఏఎస్పీ శంకర్, పీపీలు రేచల్ సంజనా జాషువా, సీఐలు శ్రీను, టాటాబాబు, ప్రదీప్కుమార్, ఎస్ఐ జిక్కీబాబు తదితరులు పాల్గొన్నారు.


