ఇటిక్యాల: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. గురువారం ఇటిక్యాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్.. పదో తరగతి గణితం పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు పలు సూచనలు చేశారు. ఇప్పటిదాక అసలే చదవని పాఠ్యాంశాన్ని ప్రసుత్తం చదివితే లాభం లేదని.. ఇప్పటి వరకు చదివిన పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రం చదివాక.. ముందుగా వచ్చిన ప్రశ్నలను ఎంచుకొని సమాధానం రాయాలన్నారు. ప్రతి విద్యార్ధి ఎక్కువ మార్కులు తెచ్చుకునేలా సాధన చేయాలని సూచించారు. అనంతరం గురుకుల పాఠశాలలోని వంటగది, స్టోర్రూం, విద్యార్ధుల వసతి గదులను పరిశీలించారు. అదే విధంగా తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కుల, ఆదాయ, భూ భారతి తదితర దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా కార్యాలయంలోని రికార్డు గది, ఇతర విభాగాలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించి.. ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. గర్భిణులు, చిన్నారులకు అందించే వ్యాధినిరోధక టీకాలు, ఔషధాల నిల్వలతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని.. హైరిస్క్ కేసులను మెడికల్ అధికారి పర్యవేక్షించాలని తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, మెడికల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం డిజిటల్ క్రాప్ సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట ఏఓ రవికుమార్, తహసీల్దార్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీడీ ఓ అజార్ మొహియొద్దీన్, వైద్యా ధికారి రాధిక, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సురేశ్ తదితరులు ఉన్నారు.


