స్వేచ్ఛగా ఓటేయాలి
న్యూస్రీల్
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
–8లో u
గద్వాల: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం అని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా.. అక్రమాలు, అవినీతికి దూరంగా ఉండి ప్రజాసేవ చేసే వ్యక్తులను ఓటర్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ కోరారు. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం ఆయన ‘సాక్షి’ దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల నిబంధనలు, పోలింగ్ ప్రక్రియ, కేంద్రాల ఏర్పాటు, ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ర్యాండమైజేషన్లో ఎన్నికల సిబ్బంది కేటాయింపు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికల ఏర్పాటు ప్రక్రియపై ఆయన మాట్లాల్లోనే..
ఐదేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎన్నుకోవాలి
ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల గత చరిత్ర, ప్రస్తుత ఆయన చేస్తున్న వ్యవహారం, ఎంతవరకు చదువుకున్నారు. గెలిపిస్తే సమస్యలు పరిష్కారం చూపుతారా....వంటి ప్రధాన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుంది.
77 వార్డులకు ఎన్నికలు
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో గద్వాలలో 37, అయిజలో 20, అలంపూర్లో 10, వడ్డేపల్లిలో 10 వార్డులు కలిపి మొత్తం 77 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
189 పోలింగ్ కేంద్రాలు
77 వార్డులకు సంబంధించి మొత్తం 1.08 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 189 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికలతో పోల్చితే 11 వేల కొత్త ఓటర్లు తమ తొలి ఓటును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా దివ్యాంగులకు వీల్చైర్లు, సహాయకులను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ విధానం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీనిద్వారా ఎక్కడైనా పోలింగ్ కేంద్రంలో సమస్య తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు.
ఎన్నికల విధుల్లో..
ఎన్నికల విధులు నిర్వహించేందుకు జిల్లాలోని 1,500 మంది ప్రభుత్వ అధికారులను కేటాయించినట్లు వెల్లడించారు. గద్వాలలో 13, అయిజలో 7, అలంపూర్లో 4, వడ్డేపల్లిలో నలుగురు చొప్పున రిటర్నింగ్ అధికారులను నియమించామన్నారు. మరో 1000 మంది అధికారులకు ఎన్నికల్లో వివిధ స్థాయిలో విధులు కేటాయించామని పేర్కొన్నారు. అదే విధంగా 330 మంది పోలీసులు, 240 మందిని స్టాండ్బై కింద ఉంచామన్నారు. అత్యవసర సమయాల్లో వీరి సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అందరికీ అవసరమైన శిక్షణను ఇచ్చి ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం చేశామన్నారు.
ఎన్నికల విధుల్లోని ఉద్యోగులకు 8వ తేదీన పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్
బీఎం సంతోష్
11 గుర్తింపు కార్డులతో..
ఓటర్లకు ఫొటోతో కూడిన ఓటరు జాబితాను సిద్ధం చేశాం. ఎవరైనా ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ప్రభుత్వం జారీ చేసిన ఏదేని గుర్తింపు కార్డు (ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, బ్యాంకు అకౌంట్ బుక్కు వంటివి)లను పోలింగ్ అధికారులకు చూయించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు
పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేశాం. వార్డుకు ఓ టేబుల్ చొప్పున కౌంటింగ్ ప్రక్రియ చేపడతాం. అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు మూడు గంటల వ్యవధిలోనే పూర్తవుతాయి. అదేవిధంగా గద్వాల మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ ఫలితాలు ఫిబ్రవరి 13న మధ్యాహ్నం దాటే అవకాశం ఉంది.
48 గంటల ముందే..
పోలింగ్ తేదీకి 48 గంటల ముందు అభ్యర్థులు తమ ప్రచారాన్ని పూర్తిగా నిలిపివేయాలి. అదే విధంగా 144సెక్షన్ అమలులో ఉంటుంది కాబట్టి గుంపులుగా తిరగొద్దు. దీనిపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాం. ఎన్నికలను పూర్తి శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీలు, పార్టీ ప్రతినిధులు సహకరించాలి.
ఓటుహక్కు వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత
11 వేల కొత్త ఓటర్ల నమోదు
జిల్లావ్యాప్తంగా 77 వార్డుల్లో ఎన్నికలు
1,500 మంది అధికారుల కేటాయింపు
కలెక్టర్ బీఎం సంతోష్
నిఘా కోసం ప్రత్యేక టీంలు
ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఉల్లంఘనలు జరగకుండా 14 ఫ్లైయింగ్, 18 ఎస్ఎస్టీ, మరో 14 సెక్టోరియల్ టీంలను ఏర్పాటు చేశాం. వీరు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ డబ్బులు, లిక్కర్ పంపిణీ వంటివి చోటుచేసుకోకుండా కట్టడి చేస్తారు.
స్వేచ్ఛగా ఓటేయాలి


