కేంద్రం నిధులతోనే అభివృద్ధి పనులు
నారాయణపేట: ‘ప్రతి వార్డుకు వచ్చేంత సమయం లేదు.. ఇక్కడికి వచ్చిన అంటే మీ ఇంటికి వచ్చి ఓటు అడిగినట్లు భావించండి.. అరుణమ్మ ఎంపీ అయినా నారాయణపేట మున్సిపాలిటీ గెలవలేకపోయింది అనే మాట రానివ్వకుండా చూడాలి’ అని ఎంపీ ఎంపీ డీకే అరుణ పుర ప్రజలను కోరారు. గురువారం జిల్లాకేంద్రంలోని సత్యనారాయణచౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. మున్సిపాలిటీలో డ్రెయినేజీలు, రోడ్లు, తాగునీటి సరఫరా కోసం కేంద్రం పెద్దఎత్తున నిధులు ఇస్తోందన్నారు. పీఎంఏవై నిధులతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రతి పైసా అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని.. మంత్రులు వేసే శిలఫలకలు అలాగే మిగిలిపోతాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్పార్టీ కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అంటే.. ఇక్కడ ఆరు గ్యారంటీలు అని ప్రజలను మోసం చేసిందన్నారు. బిల్లులు చెల్లించాలంటే కాంట్రాక్టర్లు 40 శాతం కమీషన్ చెల్లించాలనే ప్రచారం కర్ణాటక వరకు వెళ్లిందని ఇప్పుడే కర్ణాటక మాజీ ఎమ్మెల్యే రాజు పాటిల్ చెప్పారని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు నాగూరావు నామాజీ, రతంగ్పాండురెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్కుమార్, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.


