నల్లమలకు విశేష ప్రాముఖ్యత
అచ్చంపేట: నల్లమల అటవీ ప్రాంతానికి విశేష ప్రాముఖ్యత ఉందని, ప్రధానంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో జీవిస్తున్న చెంచు గిరిజనుల జీవన విధానం అడవితో విడదీయరాని బంధం ముడిపడి ఉందని ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతికుమారి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట గిరిజన సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో గ్రూప్–1 అధికారులకు 2 బ్యాచ్లుగా మూడు రోజులుగా నిర్వహించిన నల్లమల అటవీ ప్రాంత ట్రెక్కింగ్, స్టడీ టూర్ శిక్షణ తరగతుల చివరిరోజు గురువారం నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో సందర్శించిన వివిధ ప్రదేశాల వివరాలు, అక్కడ పొందిన అనుభూతులను శిక్షణ పొందుతున్న గ్రూప్–1 అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చెంచు గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూనే వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన శిక్షణ తరగతులలో అధికారులు ఆసక్తితో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి శిక్షణ ద్వారా పరిపాలనా వ్యవస్థను నేరుగా అవగాహన చేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకొని సమర్థవంతమైన నిర్ణ యాలు తీసుకునేందుకు ఈ తరహా శిక్షణ భవిష్యత్ పాలనకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను అనుగుణంగా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారులు బాధ్యతాయుతంగా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని, పొందిన అనుభవాన్ని తమ విధి నిర్వహణలో అమలు చే యాలని సూచించారు. జిల్లా యంత్రాంగం మూడురోజులుగా గ్రూప్–1 అధికారుల శిక్షణ విజయవంతం చేసేందుకు ఎంతో కృషిచేయడం జరిగిందని కలెక్టర్ బదావత్ సంతోష్ వివరించారు. అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం ట్రెక్కింగ్కు శిక్షణ అధికారులతో కలిసి శాంతికుమారి వెళ్లారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఎఫ్ఓ రేవంత్చంద్ర, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి తదితరులు పాల్గొన్నారు.
చెంచుల ఆచారాలు,
సంప్రదాయాలు గౌరవించాలి
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ స్టడీ టూర్ పాలనకు మార్గదర్శకం కావాలి
ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ శాంతికుమారి


