ఉద్దాలోత్సవం
నయనానందం
● బ్రహ్మాండనాయకుడి ప్రధాన వేడుకకు తరలివచ్చిన భక్తజనం
● గ్రామగ్రామాన
మంగళ హారతులతో స్వాగతం
● జనసంద్రంగా మారిన ఊకచెట్టువాగు, జాతర మైదానం
● గోవింద నామస్మరణతో మార్మోగిన కురుమూర్తి గిరులు
చిన్నచింతకుంట: పాలమూరు మట్టిబిడ్డల ఇంటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న అమ్మాపురం శ్రీకురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముత్యాల పల్లకీలో దళిత పూజారులు ఉద్దాలను తీసుకురాగా వేలాది మంది భక్తులు వాటిని తాకి పునీతులయ్యారు. చిన్నచింతకుంట మండలం చిన్నవడ్డెమాన్లోని ఉద్దాల మండపం నుంచి కురుమూర్తిస్వామి ఆలయం వరకు దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు ఉద్దాలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ఘట్టమైన ఉద్దాల ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వడ్డెమాన్లోని ఉద్దాల మండపంతోపాటు జాతర మైదానం జనం హోరెత్తింది. భక్తులు స్వామివారి పాదుకలను దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో కురుమూర్తి సప్తగిరులు అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి నామస్మరణతో మార్మోగాయి.
వడ్డెమాన్ నుంచి తరలింపు..
పల్లమర్రి గ్రామంలో భక్తిశ్రద్ధలతో తయారు చేసిన చాటకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చాటను ట్రాక్టర్పై వడ్డెమాన్లోని ఉద్దాల మండపానికి తీసుకువచ్చారు. ఉపవాస దీక్ష, నియమ, నిష్టలతో తయారు చేసిన పాదుకలను దర్శించుకునేందుకు భక్తులు మండపం వద్ద బారులుదీరారు. అప్పంపల్లి నెల్లి వంశస్తులు పాదుకలకు పూజలు చేసేందుకు మేళతాళాలతో మండపానికి చేరుకున్నారు. పాదుకలకు బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ సీతమ్మ, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత, ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ఉద్దాలను కురుమూర్తి గిరులకు తరలించారు.
భారీ బందోబస్తు మధ్య..
పోలీసుల భారీ బందోబస్తు మధ్య దళితులు ఉద్దాలను కురుమూర్తిగిరులకు తరలించారు. ఊకచెట్టు వాగులో ఉద్దాల చాట కింద భక్తులు దూరి తన్మయత్వం చెందారు. దీంతో రెండు గంటలపాటు ఊకచెట్టు వాగులో తిరునాళ్లు జరిగాయి. ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలివచ్చి తరించారు. శివసత్తుల పూనకాలు, భక్తుల ఆటపాటలతో గోవింద నామస్మరణ మా రుమోగింది. అక్కడి నుంచి తిర్మలాపురం గ్రామ ఆంజనేయస్వామి ఆలయానికి చేర్చగా.. గ్రామస్తులు పూజలు నిర్వహించిన తర్వాత ట్రాక్టర్పై కురుమూర్తికి తీసుకువచ్చారు. దేవుడి చెరువు కట్ట మీద ఉద్దాలను దర్శించుకునేందుకు వేలాది భక్తులు బారులుదీరారు. జాతర మైదానంలోని ఉ ద్దాల గుండు వద్ద భక్తులకు దర్శనం కల్పించి కాంచన గుహలో కొలువుదీరిన కురు మూర్తిస్వామి చెంతకు ఉద్దాలను తీసుకెళ్లి అనంతరం ఉద్దాల మండపంలో పెట్టారు.
దారులన్నీ
కురుమూర్తి వైపే..
కురుమూర్తి జాతరకు మధ్యాహ్నం నుంచి భక్తులు భారీస్థాయిలో తరలివస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, జీపులు, బైకులు, ఎద్దుల బండ్లపై భక్తులు జాతరకు చేరుకున్నారు. హైదరాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, అచ్చంపేట, వనపర్తి, గద్వాల తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. దేవరకద్ర, మక్తల్, అమరచింత, కొత్తకోట, చిన్నచింతకుంట దారుల గుండా వేలాది వాహనాలు వచ్చాయి.
ఉద్దాలోత్సవం
ఉద్దాలోత్సవం
ఉద్దాలోత్సవం
ఉద్దాలోత్సవం
ఉద్దాలోత్సవం
ఉద్దాలోత్సవం
ఉద్దాలోత్సవం
ఉద్దాలోత్సవం


