
స.హ.చట్టంతో పారదర్శకత
గద్వాల: సమాచార హక్కు చట్టం.. ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించడం జరిగిందని ఈచట్టంపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఈ నెల 5వతేదీ నుంచి 12వ తేదీ వరకు ఆర్టీఐ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఆర్టీఐ చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పౌరులకు సమాచారహక్కు చట్టం–2005 ప్రకారం అడిగిన సమాచారాన్ని నిబంధనల మేరకు దరఖాస్తుదారునికి సమాధానం ఇవ్వడం అధికారుల బాధ్యత అన్నారు. ప్రభుత్వంలో అన్ని శాఖల నుంచి తమకు కావాల్సిన సమాచారాన్ని పొందడం పౌరుల హక్కుగా చెప్పారు. ఈచట్టం ప్రకారం ప్రజలు అడిగిన సమాచారాన్ని నిర్ధేశిత సమయంలో ఇవ్వకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వారోత్సవాల సందర్భంగా గ్రామపంచాయతీలు, మండలాలు, డివిజన్, జిల్లా స్థాయిలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా స.హ.చట్టం ద్వారా ఎలాంటి సమాచారాన్ని కోరవద్దో విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రజలు అడిగిన దానిప్రకారం ఆయా శాఖలలో ఉన్న సమాచారాన్ని ఖచ్చితంగా ఇవ్వడం అధికారుల బాధ్యతగా పేర్కొన్నారు. అనంతరం ఆయన స.హ.చట్టంపై ప్రతిజ్ణ చేయించారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సిం గ్ రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

స.హ.చట్టంతో పారదర్శకత