
రైతువేదికలు.. సౌర కేంద్రాలు
భవనాలపై ప్యానల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధం
జిల్లాల వారీగా రైతువేదికలు
●
● ఒక్కో కేంద్రం వద్ద
5 కిలోవాట్ల సామర్థ్యం..
● కేంద్రాల నిర్వహణకు విద్యుత్ విక్రయం
● పైలెట్ గ్రామాలైన జానంపేట, కొండారెడ్డిపల్లిలో విజయవంతం
● అన్ని వేదికల్లో ఏర్పాటుకుసిద్ధమవుతున్న టీజీ రెడ్కో
ప్రభుత్వ నిర్ణయం మేరకే..
రైతులకు అందుబాటులో ఉంటూ సాగు సలహాలు, సూచనలు, సమీక్షల కోసం నిర్మించిన రైతువేదికల నిర్వహణకు నిధులు మంజూరుకావడం లేదు. సొంతంగా ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం హర్షణీయం. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి.
– తిరుపతి, ఏఈఓ, గుండుమాల్ క్లస్టర్
అన్ని వేదికలపై ఏర్పాటు..
ఉమ్మడి జిల్లాలో పైలెట్ గ్రామాలైన జానంపేట, కొండారెడ్డిపల్లి రైతులవేదికల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు విజయవంతమైంది. ఉమ్మడి జిల్లాలోని 467 రైతువేదికలపై ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని భవనాలు ఒకే నమూనాలో నిర్మించడంతో సౌర పలకల బిగింపు ఒకేసారి చేపట్టేందుకు వీలుంటుంది. సౌర విద్యుత్ తయారీ, విక్రయం తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అను గుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.
– మనోహర్రెడ్డి, మేనేజర్, టీజీ రెడ్కో, ఉమ్మడి పాలమూరు జిల్లా
నాగర్కర్నూల్ 140
కోస్గి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతువేదికల నిర్వహణకు నిధులు సమకూరడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదాయ సమీకరణకు రైతువేదిక భవనాలపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటుచేసి విద్యుదుత్పత్తి చేసి విక్రయించేలా చర్యలు తీసుకుంటోంది. ఒక్కో వేదికపై 5 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర పలకలు అమర్చడంతో విద్యుత్ అవసరాలు పోను ఏడాదికి సుమారు రూ.25 వేల ఆదాయం సమకూరేలా ప్రణాళికలు రూపొందించింది.
పైలెట్ గ్రామాల్లో విజయవంతం..
రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ప్రామాణికంగా తీసుకొని జిల్లాకు రెండు చొప్పున పైలెట్ గ్రామాల రైతువేదికలను ఎంపిక చేసి సౌర విద్యుదుత్పత్తి చేపట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా జానంపేట, నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిని ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో విజయవంతం కావడంతో మిగిలిన రైతువేదికపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రెడ్కో అధికారులు సిద్ధమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 467 రైతువేదికలపై సోలార్ ప్యానెల్స్ బిగించి సౌర విద్యుత్ తయారీకి చర్యలు తీసుకుంటోంది.
నిర్వహణ భారం..
గత ప్రభుత్వ హయంలో రైతులను సమావేశపర్చి శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ, సలహాలు, సూచనలు అందించడంతో పాటు ఎరువులు, విత్తనాల పంపిణీ కోసం 5 వేల ఎకరాలను ఓ క్లస్టర్గా విభజించి ఒక్కో క్లస్టర్కు ఒకటి చొప్పున రైతువేదిక నిర్మించారు. వీటి నిర్వహణ బాధ్యతను ఏఈఓలకు అప్పగించారు. భవనాల నిర్మాణం పూర్తయినా.. నిర్వహణకు నిధులు మంజూరుగాకపోవడంతో అధికారులు సైతం మిన్నకుండిపోయారు. సొంతంగా ఆదాయం లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతువేదికల లక్ష్యం నీరుగారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. రైతువేదికలపై సోలార్ పలకల ఏర్పాటుతో ఆదాయం సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రైతువేదికల నిర్వహణకు నిధుల కొరత లేకుండా సక్రమంగా సాగాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.
జోగుళాంబ గద్వాల
94
వనపర్తి 69
మహబూబ్నగర్ 87
ఆదాయ సమీకరణ ఇలా..
రెడ్కో సంస్థ అధికారిక లెక్కల ప్రకారం ఒక్కో రైతువేదికపై 5 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ పలకలు బిగిస్తే నెలకు 600 యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. సొంత అవసరాలకు 100 యూనిట్లు వినియోగించినా.. మిగిలిన 500 యూనిట్లను విక్రయించి ఆదాయం సమకూర్చుకోవచ్చు. యూనిట్ రూ.4కు అమ్మినా నెలకు రూ.2 వేలు, ఏడాదికి రూ.24 వేల ఆదాయం వస్తుంది. అయితే సౌర పలకల ఏర్పాటుకు ప్రభుత్వం ఒక్కో వేదికకు రూ.3 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం కింద సౌర పలకలు ఏర్పాటు చేయనున్నారు.

రైతువేదికలు.. సౌర కేంద్రాలు

రైతువేదికలు.. సౌర కేంద్రాలు