స్వీయ రక్షణే ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

స్వీయ రక్షణే ముఖ్యం

May 31 2025 12:24 AM | Updated on May 31 2025 12:24 AM

స్వీయ

స్వీయ రక్షణే ముఖ్యం

ప్రశ్న : ఎవరికి ప్రమాదకరం.. వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

– ప్రభాకర్‌, బుర్దాపేట్‌, గద్వాల పట్టణం

డీఎంహెచ్‌ఓ : కరోనా ప్రమాదకరం కాదు కాని, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, గతంలో కరోనా వచ్చి ఇబ్బందులకు గురైన వాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లకు రిస్క్‌ ఉంటుంది. వీళ్లందరూ స్వీయరక్షణ అంటే చేతులు కడుక్కోవడం, మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి పాటిస్తూనే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకునేలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే వాకింగ్‌ వంటి వ్యాయామం చేయాలి.

గద్వాల: కరోనా ప్రస్తుతం పాండమిక్‌ దశ నుంచి ఎండమిక్‌ దశకు చేరుకుంది. అంటే జ్వరం, జలుబు, దగ్గు, టైఫాయిడ్‌ లాంటివి ఎలానో కరోనా కూడా మనిషి జీవన విధానంలో అలా భాగమైంది. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవడంతోపాటు, స్వీయరక్షణ చర్యలు పాటిస్తే అవే మనల్ని కాపాడుతాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సిద్దప్ప అన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని.. కరోనాతోపాటు సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అడిగిన సందేహాలకు సమాధానం ఇచ్చి నివృత్తి చేశారు.

ప్రశ్న : కరోనా కొత్త వేరియంట్‌ ఏమైనా ప్రమాదకరమా..? – వెంకటేష్‌, నల్లకుంట, గద్వాల

డీఎంహెచ్‌ఓ : కరోనా కొత్త వేరియంట్‌ మ్యూటేషన్‌ (రూపాంతరం) చెందింది. మొదట్లో కరోనా పాండమిక్‌ దశగా ఉండేది. ప్రస్తుతం ఎండమిక్‌ దశకు చేరింది. అంటే మన జీవనంలో భాగమైంది. జలుబు, దగ్గు, జ్వరం మాదిరిగా ఉంది. ప్రమాదకరం కాదు.. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అయితే స్వీయరక్షణ పాటించాల్సిందే.

ప్రశ్న : కరోనాను ఎలా ఎదుర్కోవాలి.?

– శ్రీను, సెంకడ్‌ రైల్వేగేట్‌, గద్వాల

డీఎంహెచ్‌ఓ : కరోనాకు భయపడాల్సిన పనిలేదు. అయితే దీనిని ఎదుర్కోవాలంటే మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, కలుషిత ఆహారం, నీటిని తీసుకోకుండా జాగ్రత్తలు పాటించడం మంచింది.

ప్రశ్న : సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.

– విజయ్‌కుమార్‌, పాతహౌసింగ్‌బోర్డు, గద్వాల

డీఎంహెచ్‌ఓ : సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా వానాకాలం సీజన్‌ కంటే కూడా 15, 20 రోజుల ముందస్తుగానే వానలు వచ్చాయి. వానలు నిరంతరాయంగా కురిస్తే ఇబ్బందులు ఉండవు. కానీ, వానలు వెలసిపోయిన తర్వాత నిలిచిన నీటి వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రధానంగా దోమలకు ఆవాసంగా మారుతుంది. దోమలు గుడ్లు పెట్టి వాటిని పెద్దఎత్తున వ్యాప్తి చెందిస్తాయి. దీంతో టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యూ, చికెన్‌ గున్యా లాంటివి వస్తాయి. మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో నీటినిల్వ లేకుండా చూడడం, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం చర్యలు తీసుకోవడం వంటివి పాటించాలి. అలాగే దోమల నివారణకు ఫాగింగ్‌ వంటివి చేపట్టి నాశనం చేస్తాం. ప్రత్యేక వైద్య బృందాలతో పర్యవేక్షణ చేపడతాం. జిల్లాస్థాయిలో డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారుల బృందం, మండల స్థాయిలో మెడికల్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారుల బృందం నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాం. ఎక్కడైనా జ్వరం, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటివి ఎక్కువ మందికి వస్తే అక్కడే ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు వైద్యం అందిస్తాం. జిల్లాలోని జీజీహెచ్‌, అన్ని పీహెచ్‌సీల డాక్టర్లకు కరోనా, సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకునేలా ఇప్పటికే ఆదేశాలిచ్చాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఏఎన్‌ఎం, ఆశాల వరకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది.

కరోనా వ్యాప్తి గురించి ఆందోళన వద్దు

మాస్క్‌ ధరించడం, చేతులు కడుక్కోవడం తప్పనిసరి

జనరల్‌ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశాం

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో డీఎంహెచ్‌ఓ సిద్దప్ప

ప్రశ్న : ప్రభుత్వ పరంగా కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు.

– రమేష్‌, చిన్నఅగ్రహారం, గద్వాల

డీఎంహెచ్‌ఓ : కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి. ఇటీవలి జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే కరోనా పరీక్ష నిర్వహిస్తాం. కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లయితే వెంటనే వారి కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా వైద్యం అందిస్తాం. కరోనా పరీక్షలకు అవసరమైన కిట్లు అన్ని సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా వాటికి సరిపడా మందులు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి.

స్వీయ రక్షణే ముఖ్యం 1
1/1

స్వీయ రక్షణే ముఖ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement