
నేరాల నియంత్రణకే కార్డెన్ సెర్చ్
శాంతినగర్: జిల్లాలో నేరాల నియంత్రణ కోసమే కార్డెన్ సెర్చ్ చేపడుతున్నామని, ప్రజలు సహకరించాలని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్లోని ఇందిరానగర్కాలనీలో శుక్రవారం సాయంత్రం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని అన్ని ఇళ్లు, వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్లు లేని 70 మోటార్సైకిళ్లు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చి కొందరు నేరాలకు పాల్పడుతున్నారని, ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే వారి పూర్తి వివరాలు కనుక్కొని ఇళ్లు అద్దెకు ఇవ్వాలని, అపరిచితులు, అనుమానం ఉన్న వ్యక్తులు కాలనీల్లో సంచరిస్తుంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేగాక వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్ట్ పెట్టుకోవాలని, ప్రమాదాలు జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర ఉంచుకోవాలన్నారు. ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫోన్లు జాగ్రత్తగా వాడాలన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరిస్తామని ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రవాణా, పేకాట, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ టాటాబాబు హెచ్చరించారు.