
అభివృద్ధి దిశగా అడుగులు
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, జిల్లా ఏర్పాటుతో ప్రగతి పరుగులు
వివరాలు 8లో u
గద్వాల: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పరంగా వడివడిగా జిల్లా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. 2016లో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా జోగుళాంబ జిల్లా ఏర్పాటుతో ప్రగతి మరింత పరుగులు పెట్టింది. గడచిన పదేళ్లలో జిల్లాలో నూతనంగా తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతలు, మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటయ్యాయి. అలాగే, 30శాతం మేర వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా గడిచిన పదేళ్ల కాలంలో జిల్లాలో వివిధ శాఖల పరంగా జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓ సారి పరిశీలిద్దాం.
నిరంతర విద్యుత్ సరఫరా..
జిల్లాలోని పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి 24గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ను అందించేలా అవసరమైన సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు, సర్వీస్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 6 లక్షల 17వేల మంది కుటుంబాలకు రూ.15.96కోట్లు లబ్ధిచేకూరింది. అలాగే, జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ సురక్షిత తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం అమలు చేసింది. దీని ద్వారా జిల్లాలోని 319గ్రామాలకు తాగునీటిని అందించేందుకు రూ.209కోట్లు వ్యయం చేశారు. అదేవిధంగా రూ.508కోట్లతో తాగునీటిని అందించేందుకు అవసరమైన పైపులైన్లు, ఓహెచ్బీఆర్, డబ్ల్యూటీపీ, జీఎల్బీఆర్ సంపుల నిర్మాణాలు పూర్తి చేశారు.
వైద్య కళాశాలల ఏర్పాటుతో సంపూర్ణ సేవలు
జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరైంది. తరగతులు సైతం మొదలయ్యాయి. భవన నిర్మాణ పనులు మొదలుకావాల్సి ఉంది. అలాగే, రూ.34.90కోట్లతో నూతనంగా నర్సింగ్ కళాశాల సైతం మంజూరు కాగా.. 2021 డిసెంబర్ 22న అడ్మిషన్లు సైతం మొదలయ్యాయి. ఇక అలంపూర్లో రూ.21 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, అయిజ పీహెచ్సీని రూ.79లక్షలతో 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్, జిల్లా కేంద్రంలో రూ.39.79కోట్లతో జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూ.23కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్లు, రూ.2.50కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోర్ మంజూరు, కంటివెలుగు ద్వారా మొదటి విడతలో జిల్లాలో 2,83,216 మందికి, రెండో విడతలో 2,63,320మంది పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఇక గద్వాల మున్సిపాలిటీలో సీఎం ప్రత్యేక ఽనిధి కింద రూ.56కోట్ల విలువైన వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల పరిధిలో రూ.40కోట్లకు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. ఆసరా పథకం ద్వారా 68,952 మంది లబ్ధిదారులకు ప్రతినెలా రూ.16.82కోట్లు అందజేస్తున్నారు. 262 మహిళా సంఘాల నుంచి నేడు 6,653 సంఘాలకు పెంచారు. రుణాల ద్వారా 74,002మంది లబ్ధి చేకూరింది. బ్యాంకు లింకేజీ ద్వారా 2014–15నుంచి 2022–23వరకు రూ.8.65కోట్లు రుణాలు ఇచ్చారు. ఇక హరితహారం పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 137.09లక్షల మొక్కలు నాటారు.
రైతులకు చేదోడుగా ‘రైతుబంధు’
2019–20 సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ద్వారా పది విడతలుగా ఎకరాకు రూ.5వేల చొప్పున జిల్లాలో 1,60,799 మంది రైతులకు రూ.1,924.61కోట్లను వారి ఖాతాల ద్వారా అందజేశారు. అదేవిధంగా రైతుబీమా ద్వారా జిల్లాలో చనిపోయిన 2,572 మంది రైతుల కుటుంబాలకు రూ.128.60కోట్లు అందజేశారు. ఇక వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 231మంది రైతులకు సబ్సిడీపై రూ.7.33కోట్ల విలువైన 231ట్రాక్టర్లు, 14,397మంది రైతులకు రూ.5.46 కోట్ల విలువైన వివిధ రకాల వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. రూ.23.34కోట్లతో 97 రైతు వేదికలను నిర్మాణం, రైతులకు రూ.914కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది.
పదేళ్లలో రూ.1,942.61 కోట్లు
రైతుబంధు పంపిణీ
తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం
30.16శాతం వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం పెంపు
రూ.39.65 కోట్లతో జిల్లా ఆసుపత్రి.. రూ.21 కోట్లతో అలంపూర్లో
వంద పడకల ఆస్పత్రి నిర్మాణం
మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటు
రూ.96 కోట్లతో గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ పురపాలికల్లో అభివృద్ధి పనులు
ఆకలి తీరుస్తున్న ‘ఆహార భద్రత’
జిల్లాలో 335 చౌకధర దుకాణాల నుంచి ప్రతినెలా 1,69,693 మంది లబ్ధిదారులకు ఆహారభద్రత పథకం కింద 3591.42టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అలాగే, మన ఊరు మన బడి పథకం కింద జిల్లాలో 161 పాఠశాలలను ఎంపిక చేసి వివిధ రకాల అభివృద్ధి పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. ఽజిల్లాల ఏర్పాటులో భాగంగా నూతన కలెక్టరేట్, ఎస్పీ భవనాల నిర్మాణాలు చేశారు. అలాగే, 2023 వరకు 2035 మందికి రూ.17.10కోట్ల పరిశ్రమల స్థాపనకు అందజేశారు. అలాగే, జిల్లాలోని 5 చేనేత సహకార సంఘాలకు ఇప్పటి వరకు రూ.59.27లక్షలు పావలా వడ్డీ రుణాలు, 40శాతం రాయితీ ద్వా రా 6234మందికి నూలు అందజేశారు. ఇందుకోసం రూ.10.11కోట్లు డీబీటీ పద్దతి ద్వరా లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాలో జమచేశారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
రాష్ట్రం ఏర్పడే నాటికి జిల్లాలో 2014–15లో రెండు సీజన్లు కలిపి మొత్తం పంటల సాగు విస్తీర్ణం 4,27,397 ఎకరాలు ఉంటే 2022–23 నాటికి రెండు సీజన్లు కలిపి 5,56,335 ఎకరాలకు పెరిగింది. అంటే గడచిన తొమ్మిదేళ్లలో 30.16శాతం మేర పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలోని 8 మండలాల్లో రూ.45.06కోట్లతో 345 చెరువులను పుణరుద్ధరించారు. ఇందులో 262 చెరువు పనులు పూర్తి కాగా మిగిలిన పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. ఇవి పూర్తయితే వీటి కింద 16.909ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. ఇదిలాఉండగా, ఆర్డీఎస్ కింద సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న 55,600 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు రూ.783కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఇందులో మొదటి దశంలో రూ.397కోట్లతో పనులు ప్రారంభించి రూ.159కోట్ల పనులు పూర్తి చేయగా, దీనిద్వారా మొదటి పంపు ద్వారా 2018లో ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందుతుంది. ఇక గట్టు, కె.టి.దొడ్డి మండలాల్లోని 33వేల ఎకరాల బీడుభూములకు సాగునీటిని అందించే లక్ష్యంతో రూ.487.03కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. అలాగే, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేసేందుకు రూ.11కోట్లు నిధులు విడుదల చేసింది. పనులు కొనసాగుతున్నాయి.
అన్ని రంగాల్లో అభివృద్ధి
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం.. అందులోనూ జిల్లాగా ఏర్పడిన తర్వాత గద్వాలలో అభివృద్ధి పరుగులు పెట్టింది. విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, 200 బెడ్స్ ఆసుపత్రి, గట్టు లిఫ్ట్, నూతన విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగించి గద్వాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాను.
– బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే

అభివృద్ధి దిశగా అడుగులు

అభివృద్ధి దిశగా అడుగులు

అభివృద్ధి దిశగా అడుగులు

అభివృద్ధి దిశగా అడుగులు