
ఉద్యానం.. షురూ
వానాకాలంలో 45,906 ఎకరాల్లో ఉద్యానసాగు అంచనా
గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో ఉద్యాన పంటల సాగు ఆరంభం అయ్యింది. వానాకాలం సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకుతోడు బోర్లు, బావుల కింద రైతులు ఉద్యాన పంటలు వేయడం ఆరంభించారు. కొద్ది రోజుల నుంచి పలుచోట్ల కూరగాయల విత్తనాలు వేయడం, నారు నాటడం, పండ్ల తోటలకు సంబందించి మొక్కలు నాటడం తదితరమైనవి చేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్లో 45,906 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనాకు వచ్చారు. ఇందులో ఎక్కువగా ఎండుమిర్చి, కూరగాయలు, ఆయిల్ఫాం సాగు ఉండనున్నాయి.
గతేడాది ఉద్యానానికి అనుకూలం
2023–24లో అటు వానాకాలం, ఇటు యాసంగి సీజన్లలో ఉద్యాన పంటలకు వాతావరణ పరిస్థితులు ఏమ్రాతం అనుకూలించలేదు. కానీ, 2024–25 ఉద్యాన పంటలకు ఊరట ఇచ్చింది. జూన్, జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు విస్తారంగా కురిసాయి. బోర్లు, బావులు రీచార్జ్ అయ్యాయి. ఉష్టోగ్రతలు కూడా తగ్గాయి. ఇలా వర్షాలు కురవడం, నీటి వనరులు రీచార్జ్ కావడం, వాతావరణం అనుకూలంగా మారడం ఉద్యాన పంటల సాగుకు కలిసొచ్చింది. వీటి ఫలితంగా 2023–24 కన్నా 2024–25లో ఉద్యాన సాగు పెరిగింది. కాగా ఉద్యాన పంటల్లో భాగంగా ఈ ప్రాంతంలో ఎండుమిర్చి సాగు ఏటా పెరుగుతోంది. అయితే 2024–25 ఏడాదిలో ఎండుమిర్చి దిగుబడులు బాగా వచ్చినా.. ధరలురాలేదు. దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టాలు చూశారు.
వానాకాలం సాగు అంచనా.. (ఎకరాల్లో)
అనువైన నేలలు..
ఉద్యాన పంటలకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్లతోటలు, ఆయిల్పాం, కూరగాయల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువగా ఉంది. వంకాయ, టమాట, బెండ, బీర, కాకర, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, సోరకాయ, పచ్చిమిర్చి, ఉల్లి తదితర కూరగాయల, మామిడి, బత్తాయి, నిమ్మ, జామ, దానిమ్మ తదితర పండ్లతోటలు ఆయిల్ ఫాం తోటలు, ఎండుమిర్చి ఏటా సాగు చేస్తున్నారు. అయితే వానాకాలం సీజన్ ఆరంభం అవ్వడంతో ఉద్యాన సాగు జిల్లాలో షురూ అయ్యింది. గడిచిన పది రోజుల వ్యవధిలో ఐదుసార్లు ఓ మోస్తారు వర్షాలు కురిసాయి. వాతావరణం చల్లబడింది. దీంతో బోర్లు, బావుల కింద ఉద్యాన పంటలు వేయడం ఆరంభం అయ్యింది. మే నెలలోనే వివిధ రకాల కూరగాయల నారు కోసం విత్తనాలు మడిలో వేశారు. నారు చేతికి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల కూరగాయల నారు, కొనిచోట్ల విత్తనాలు వేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల ఆయిల్ ఫాం, పండ్లతోటలు వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఎండుమిర్చి జూన్ ఆఖరు, జులై రెండో వారం నుంచి వేయనున్నారు. అయితే గడిచిన ఏడాదితో పోల్చితే ఈఏడాది ఎండుమిర్చి సాగు తగ్గే అవకాశం ఉంది. ఇంకా సుబాబుల్, పూల తదితర ఉద్యాన పంటలు సైతం ఇక్కడి రైతులు వేస్తారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 45,906 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు అవుతాయని అధికారుల అంచనా. ఇదిలాఉంటే ఈఏడాది వర్షాలు బాగా కురిసి, ఉద్యాన పంటలు ఆశజనకంగా పండుతాయని రైతులు భావిస్తున్నారు.
ఎండుమిర్చి 30,305
ఆయిల్పాం తోటలు 3,936
కూరగాయలు 4,754
పండ్లతోటలు 1,850
ఇతర పంటలు 5,061
సలహాలు సూచనలు తీసుకోవాలి
ఉద్యాన పంటలకు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వానాకాలం సీజన్లో భాగంగా ఉద్యాన పంటల సాగు ఆరంభం అయ్యింది. కూరగాయలు, పండ్లతోటలు, ఆయిల్ ఫాం తోటలు వేసే రైతులు తగిన సలహలు, సూచనలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
– ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యాన శాఖాధికారి
గత పది రోజులుగా ఓ మోస్తరు వర్షాలు
పలు చోట్ల విత్తనాలు విత్తుతున్న రైతులు

ఉద్యానం.. షురూ

ఉద్యానం.. షురూ