
ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే సద్దలోనిపల్లి కృష్ణస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్ప స్వామి ఆలయాలతో పాటు వివిధ గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిశిలా క్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఓపెన్ స్కూల్
ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత నెల మొదటి వారంలో జరిగిన ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 559 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 374 మంది (67.09 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 455 మంది పరీక్ష రాయగా.. 255 మంది (52.43 శాతం), వనపర్తి జిల్లా పరిధిలో 346 మందికి గాను 289 (88.59 శాతం), నాగర్కర్నూల్ జిల్లాలో 353 మందికి గాను 235 (67.10 శాతం), నారాయణపేటలో 503 మంది పరీక్ష రాయగా.. 424 మంది (84.48 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు.
● ఇంటర్మీడియట్కు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో 841 మంది పరీక్ష రాయగా.. 490 మంది (60.21 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 652 మందికి గాను 412 (63.12 శాతం), వనపర్తి పరిధిలో 510 మందికి గాను 370 మంది (72.84 శాతం), నాగర్కర్నూల్లో 746 మందికి గాను 546 మంది (73.30 శాతం), నారాయణపేట జిల్లాలో 897 మందికి గాను 528 మంది (59.62 శాతం) నమోదు చేసినట్లు డీఈఓ ప్రవీణ్కుమార్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య పేర్కొన్నారు.
రైతులపై కేసులు
ఎత్తివేయాలి
రాజోళి: ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో అమాయక రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీజేపి జిల్లా అధ్యక్షుడు టి.రామాంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం రాజోళిలోని బీజేపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ వద్దని ప్రజలు విన్నవిస్తున్నా కూడా.. ఎందుకు బలవంతంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే 40 మందిపై కేసులు నమోదు చేశారని, 12 మందిని రిమాండ్ కు తరలించారని, తమ గొంతుకను వినిపిస్తే కూడా అక్రమ కేసులు బనాయిస్తారా అని ఆయన ప్రశ్నించారు. రైతుల వెంటనే ఉంటూ, వారికి మద్దతుగా బీజేపి పార్టీ నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మదుసూదన్ గౌడ్. మండల అధ్యక్షుడు శికుమార్,నాగరాజు, రాఘవేంద్ర, వెంకటేష్, సహదేవుడు పాల్గొన్నారు.
బీచుపల్లి అంజన్న
సన్నిధిలో దాసంగాలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి సన్నిధిలో శనివారం భక్తులు ప్రత్యేక దాసంగాలను సమర్పించారు. నెల రోజుల పాటు జరిగే జాతరలో చివరి వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పుణ్యక్షేత్రం పరిసరాలు ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగాయి. ఆలయ అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు బీచుపల్లికి చేరుకొని స్వామివారిని దర్శించుకొన్నారు. మట్టి కుండలలో ప్రత్యేక నైవేద్యం, కుడుములు వండి ఆంజనేయస్వామికి సమర్పించారు.

ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు

ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు