
ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం
ధరూరు: వర్షాకాలంలో వరద నీటితో రిజర్వాయర్లను నింపి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి కుడి కాల్వకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈసారి కూడా గతేడాది మాదిరిగానే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని, రైతులకు ఇబ్బంది కలగకుండా సాగు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందస్తుగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు వరద రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి జూరాలకు వస్తున్న వరద ఆధారంగా వారం రోజుల క్రితమే నీటి పంపింగ్ను ప్రారంభించి ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లను నింపేందుకు చర్యలు చేపట్టామన్నారు. వీటిని నింపడం ద్వారా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని ప్రజానీకానికి తాగు, సాగు నీరందించేందుకు ఉపయోగపడతాయన్నారు. అధికారులు రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని, సాగునీరు వృథా కాకుండా చూడాలని పీజేపీ అధికారులకు సూచించారు. నడిగడ్డ ప్రాంతానికి జూరాల గుండెకాయ లాంటిదని, ఈ ప్రాజెక్టు నుంచే ఎత్తిపోతల పథకాలకు సాగు నీరందుతోందన్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతు సంక్షేమం కోసం పాటు పడతాయన్నారు. రెండు పంటలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రామన్గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు పద్మ, నాయకులు కృష్ణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, ప్రభాకర్గౌడ్, వంశీ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.