
వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో శుక్ల పంచమిని పురస్కరించుకొని శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, కుంకుమార్చనలు, మహానైవేద్య నీరాజనాలు, విశేష అలంకరణ వంటి పూజలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని భక్తిశ్రద్ధలతో సరస్వతి దేవిని దర్శించుకొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు.. చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వేదమంత్రాల నడుమ వైభవంగా చేయించారు. వివిధ ప్రాంతాల నుండి హాజరైన భక్తులకు పాలక మండలి ఆధ్వర్యంలో అల్పాహారం, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.