
బడిబాటకు వేళాయె..!
నేటి నుంచి 19 వరకు నిర్వహణ
● ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు
పెంచేలా చర్యలు
గద్వాలటౌన్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. పిల్లలు వేసవి సెలవులు ముగించుకుని తిరిగి ఈ నెల 12 నుంచి పాఠశాలలకు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని పెంచేందుకు విద్యాశాఖ ‘బడిబాట’ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో ఈ నెల 6 నుంచి 19 వరకు చేపట్టనున్నారు. పక్షం రోజుల పాటు పలు కార్యక్రమాల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
సిబ్బందికి సూచనలు
బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు, ఎంఐఎస్ సమన్వయకర్తలకు, సీఆర్పీలకు ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో ‘మేమున్నాం.. మీ పిల్లలను చేర్పించండి’, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన సాగిస్తామని పేర్కొంటూ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు శుక్రవారం నుంచి ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగనున్నారు.
గతేడాది ప్రవేశాలు..
జిల్లాలో 503 వివిధ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. గతేడాది బడిబాట సందర్భంగా మొత్తం 3,530 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఇందులో అంగన్వాడీల నుంచి 2,852 మంది విద్యార్థులు చేరగా... ప్రైవేటు పాఠశాలల నుంచి ఒకటో తరగతి విద్యార్థులు 46 మంది విద్యార్థులు చేరారు. 404 మంది విద్యార్థులు నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి అడ్మిషన్ పొందారు. వీరితో పాటు 197 మంది కొత్త విద్యార్థులు వారి వయస్సు ఆధారంగా 2 నుంచి 12వ తరగతుల్లో చేరారు. 31 మంది విద్యార్థులు బడీడు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరారు.
షెడ్యూల్ ఇలా..
జూన్ 6న గ్రామ సభ, 7న ప్రతి ఇంటికి వెళ్లి బడీడు పిల్లలను గుర్తించాలి. 8, 9, 10వ తేదీల్లో ఇంటింటి ప్రచారం. అంగన్వాడీ కేంద్రాల సందర్శన. బడి బయట ఉన్న చిన్నారులను గుర్తించి బడిలో చేర్పించడం. 11న అప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష సమావేశం. 12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల ప్రారంభం. అదే రోజు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ. 13న సామూహిక అక్షరభ్యాసం. బాలల సభ. 17న విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవాన్ని నిర్వహించాలి. 18న తరగతి గదులు డిజిటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలి. 19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించాలి.