
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
ధరూరు: భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం మండలంలోని అల్వలపాడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యలను పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని వివరించారు. భూ రికార్డులలో తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దులు నిర్ధారణ, పార్ట్ బీలో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు రెవెన్యూ సదస్సులలో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నిర్ధేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాలలో అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి అర్జీలను స్వీకరిస్తారని, ఆగస్టు 14వ తేదీ అన్ని ఆర్జీలను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ల వద్ద వసతులు, సిబ్బంది పని తీరును పరిశీలన చేసి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్, రెవన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి
గద్వాల: జవహార్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కలెక్టర్ చాంబర్లో పెండింగ్ ఆయకట్టు, భూ సేకరణపై సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సంబందించి భూ సేకరణను సకాలంలో పూర్తి చేయాలన్నారు. రైతులు పంట సాగుకు ప్రారంభించే ముందే భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. వచ్చే రెండు వారాల్లోగా ఫీల్డ్ సర్వే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూ సేకరణ ప్రక్రియకు సంబందించి పురోగతిని ప్రతి వారం నివేదికను సమర్పించాలన్నారు. భూ సేకరణలో ప్రక్రియలో ఇప్పటికే అవార్డుల దశకు చేరుకున్న వాటిని వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులను ఒప్పించి, భూ సేకరణ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు. క్షేత్ర స్థా యిలో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సర్వే చేసేందుకు సర్వే ల్యాండ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, భూ సేకరణ స్పెషల్ డీప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ రహిముద్దీన్, అధికారులు పాల్గొన్నారు.