
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
గద్వాలటౌన్: పర్యావరణ వ్యవస్థలో సమస్త జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయని, అటువంటి పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని అడిషినల్ కలెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీన్ని పురస్కరించుకుని గురువారం కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో ఉత్సహాంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పట్టణ ప్రధాన రహదారుల వెంట సాగింది. అనంతరం స్థానిక రాజీవ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొక్కల పెంపకం వల్ల కాలుష్యం తగ్గుతుందని, వర్షాలు సమృద్ధిగా పడుతాయని, వాతావరణంలో సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుతుందని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. ప్లాస్టిక్ భూతం నుంచి మన ధరిత్రిని రక్షించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు అందరూ కంకణబద్దులై ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు, సహాయక పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ విద్యులత, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్బాబు, ఎఫ్ఆర్ఓ పర్వేజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.