ఫిర్యాదులపై వేగవంతంగా చర్యలు : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులపై వేగవంతంగా చర్యలు : ఎస్పీ

May 31 2025 12:24 AM | Updated on May 31 2025 3:30 PM

గద్వాల క్రైం: సమస్యలపై వచ్చే బాధితుల పట్ల సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఉదయం ఎస్పీ రూరల్‌ పోలీసుస్టేషన్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ఫిర్యాదులపై వేగవంతగా విచారణ చేపట్టి బాధితులకు పోలీస్‌ శాఖపై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని ఎస్‌ఐ శ్రీకాంత్‌కు సూచించారు. గ్రామాల్లో నిత్యం గస్తీ, పెట్రోలింగ్‌ నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ క్రైం, మహిళల వేధింపులు, అత్యాచార యత్నం, మిస్సింగ్‌ కేసులలో ప్రత్యేక నిఘా ఉంచి తగు చర్యలు తీసుకోవాలన్నారు. 

గ్రామ శివారుల్లో నిత్యం వాహనాల తనిఖీలతోపాటు డ్రంకెన్‌ డ్రైవ్‌ చేపట్టాలన్నారు. స్టేషన్‌ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నమోదైన కేసుల వివరాలు, కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసి నేరస్తులకు శిక్షపడేలా కృషి చేయలన్నారు. డయల్‌ 100 కాల్స్‌ విషయంలో త్వరగా స్పదించాలని ఆదేశించారు.

వేరుశనగ క్వింటాల్‌ రూ.5,339

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని మార్కెట్‌ యార్డుకు శుక్రవారం 12 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.5,339, కనిష్టంగా రూ.3,619, సరాసరిగా రూ.3,619 ధరలు పలికాయి. అలాగే 94 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టంగా రూ.1,979, కనిష్టంగా రూ.1,509, సరాసరిగా రూ.1,979, 2 క్వింటాళ్ల కంది రాగా.. సరాసరిగా రూ.6,106 ధరలు లభించాయి.

ఫీల్డ్‌ అసిస్టెంట్ల బకాయిలు విడుదల చేయాలి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఇవ్వాల్సిన పెండింగ్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి నారాయణగౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు మున్సిపల్‌ కార్యాలయ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జాబ్‌కార్డులను వెంటనే ఇవ్వాలని కోరారు. ఉపాధి పనిని పట్టణ కూలీలకు వర్తింపచేయాలని సూచించారు. పని దినాలను 200 రోజులకు పెంచి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్రామ పంచాయతీల్లో జాబ్‌కర్డాలలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

పని చేసిన వారికి వారంలోపు వేతనాలు చెల్లించాలన్నారు. పని ప్రదేశంలో మం చినీళ్ల, మెడికల్‌ కిట్లు, టెంట్‌ ఏర్పాటు, పనిమూర్లు, ఓఆర్‌ఎస్‌ పాకెట్లను ఇవ్వాలన్నారు. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌ మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా నిధులను పని దినాలను కూలీలకు జాబ్‌కార్డులను పెద్ద ఎత్తున కోత విధించిందని ఆరోపించరు. అనంతరం డీఆర్‌డీఓ నర్సిములుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, హన్మంతు, భగవంతు రాములు, శివలీలా, ఎఫ్‌ఏలు వెంకటయ్య, నర్సిములు, సాయిలు, చంద్రశేఖర్‌, వెంకటయ్య, మొగులయ్య, కొం్డయ్య, నీలమ్మ, మంజుర చెన్న య్య, దాసు, జయమ్మ నాగలక్ష్మి పాల్గొన్నారు.

మక్తల్‌ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

షాద్‌నగర్‌రూరల్‌: నారాయణపేట జిల్లా మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటన ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద చోటుచేసుకుంది. వివరాలివీ.. మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం తన కారులో హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌వైపు వెళ్తున్నారు. జడ్చర్లవైపు నుంచి షాద్‌నగర్‌వైపు వెళ్తున్న మరో కారు టోల్‌ప్లాజాలోని వేరే లైన్‌కు మారేందుకు డ్రైవర్‌ పక్కకు తిప్పాడు. ఎమ్మెల్యే వాహనం టోల్‌ప్లాజాను దాటి వెళ్తున్న సమయంలో పక్కనుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి స్థానిక నేతలు గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసి మరో వాహనంలో పంపించారు.

ఫిర్యాదులపై వేగవంతంగా చర్యలు : ఎస్పీ 1
1/1

ఫిర్యాదులపై వేగవంతంగా చర్యలు : ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement