
పొగాకు రైతు అయోమయం
● కొనుగోళ్లు చేపట్టకుండానిండా ముంచుతున్న కంపెనీలు
● రేపు, మాపు అంటూ కాలయాపన
● అకాల వర్షాలతో తప్పని ఇబ్బందులు
●
8 ఎకరాల్లో సాగు చేశా
దాదాపు 8 ఎకరాల్లో పొగాకు పంట సాగుచేశాను. ముందుగానే ధర రూ.15500 నిర్ణయించారు. సిగరేట్ పొగాకు లాభసాటిగా ఉంటుందని సాగుచేశా. తీరా పంట వేశాక ఇబ్బందులు తప్పడం లేదు. అకాల వర్షాలు ఓ వైపు.. పంట కొనుగోలు చేయకుండా కంపెనీల యాజమాన్యాలు మరోవైపు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వం చొరవ చూపి పంట కొనుగోలు చేసేలా చూడాలి. లేదంటే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే మాకు శరణ్యం.
– బజారన్న, పొగాకు రైతు, మానవపాడు
పంట నల్లగా మారుతోంది..
అకాల వర్షాలతో పొగాకు పంట నల్లగా మారుతోంది. దీంతో విక్రయించే సమయంలో వ్యాపారులు ధర చాలా తక్కువ చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి అప్పులు చేసి పంటలు పండించిన రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసేలా ఆయా కంపెనీల యాజమాన్యాలకు సూచించాలి. – మహేష్బాబు,
పొగాకు రైతు, మానవపాడు
మానవపాడు: ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే.. తీరా కొనుగోలు చేసే సమయంలో కంపెనీలు తాత్సారం చేస్తుండడంతో పొగాకు రైతు అయోమయంలో పడ్డాడు. రోజులు కాదు.. నెలల తరబడి రేపు, ఎళ్లుండి కొంటాం అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎన్నో ఆశలతో సాగుచేసిన పోగాకు పంట రైతుల ఆశలను నీరు గారుస్తోంది. పొగాకు సాగుకు ముందే కొన్ని కంపెనీలు తాము కొనుగోలు చేస్తాం.. మీరు పండించండి అని రైతులతో కాంట్రాక్ట్ చేసుకుంటారు. తీరా పంట చేతికి అందిన తర్వాత ఇలా తాత్సారం చేస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను సాగుచేసే ముందు రైతులు ఐటీసీ, జీపీఐ, అలయన్స్, వీఎస్టీ తదితర కంపెనీలతో కాంట్రాక్టు చేసుకొన్నారు. క్వింటా పొగాకు ధర రూ.15,500 నిర్ణయించారు. నిర్ణయించిన రేట్లు చెల్లించి పొగాకు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు పంట సాగు చేశారు. దిగుబడి కుడా రైతులకు అశించిన స్థాయిలో వచ్చింది. సిగరెట్, బీడీ రకం పొగాకు డిసెంబర్లో పంట కోసి దోర్నాలు కట్టారు. ఒక్కోసారి పొగాకు దోర్నాలు మండెకు తిప్పేందుకు దాదాపు రూ.3వేల ఖర్చు వస్తోంది. నేటి వరకు ఖర్చు వేలలో అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలయాపన
ఐటీసీ, జీపీఐ, అలయన్స్, వీఎస్టీ కంపెనీలు పొగాకు కొనుగోలు చేస్తాం అని చెప్పి.. ఇప్పుడేమో నేడు.. రేపు అంటూ కంపెనీల చుట్టూ తిప్పుకుంటున్నారు. తమ నుంచి తక్కువ ధరకు పొగాకు కొనుగోలు చేసే దిశగా కంపెనీలు మోసం చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు పొగాకు నల్లగా మారిందని వ్యాపారులు తక్కువ ధరకు నిర్ణయిస్తున్నారని, క్వింటాకు రూ.10వేల నుంచి రూ.13వేల వరకు కొనుగోలు చేస్తున్నారని వాపోతున్నారు.
కలెక్టర్ ఆదేశించినా..
జిల్లాలో మానవపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల, ఎర్రవల్లి, అలంపూర్ తదితర మండలాల్లో పొగాకును వందల ఎకరాల్లో సాగుచేశారు. నేరుగా కలెక్టర్ కలగజేసుకొని.. రైతుల నుంచి పోగాకు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినా కంపెనీల యాజమాన్యాలు, వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు అకాల వర్షాలు పొగాకు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వర్షానికి తడిస్తే నల్లగా మారే ప్రమాదం ఉందని వాపోతున్నారు. దీంతో వ్యాపారులు క్వింటాపై రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు తక్కువ ఇస్తున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

పొగాకు రైతు అయోమయం

పొగాకు రైతు అయోమయం