ఆయిల్‌పాం కష్టాలు తీరేనా? | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పాం కష్టాలు తీరేనా?

Apr 30 2025 12:19 AM | Updated on Apr 30 2025 12:19 AM

ఆయిల్

ఆయిల్‌పాం కష్టాలు తీరేనా?

నర్వ: దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం వంటి కారణాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. డిమాండ్‌ మేర నూనె గింజల ఉత్పత్తే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు అనువైన నేలలు ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభంలో కాస్త వెనకబడినా.. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం పరిశ్రమ లేకపోవడంతో రైతులు పంటను విక్రయించేందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా..

2020–21 సంవత్సరం ప్రారంభంలో ఉమ్మడి జిల్లా పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక కాగా.. 430 ఎకరాల్లో రైతు లు ఆయిల్‌పాం సాగుకు శ్రీకారం చుట్టగా.. అధికారు లు 4,60,000 మొక్కలను దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 28,999 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవుతోంది. నారాయణపేట జిల్లాలో 5,907 ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. జిల్లాలో ఆయిల్‌పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు ఆయిల్‌పాం గెలలను తరలించాల్సి వస్తోంది.

ఆశించిన స్థాయిలో దిగుబడి..

ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 29వేల ఎకరాల్లో పంట కోత లు చేపట్టినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో 130 టన్నులు, వనపర్తిలో 600, జోగుళాంబ గద్వాలలో 300, మహబూబ్‌నగర్‌లో 260 టన్నుల దిగుబడి రాగా.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇప్పడిప్పుడే పంట కోత ప్రారంభమైంది.

లాభసాటిగా ధరలు..

గతేడాది ఆయిల్‌పాం టన్నుకు రూ. 11వేల నుంచి రూ. 14వేల వరకు ధర ఉండేది. ప్రస్తుతం టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 21వేల వరకు ధర పలుకుతోంది. దీంతో ఆయిల్‌పాం రైతులకు లాభసాటిగా మారింది. ఏడాది పాటు కాపు కాస్తుండటంతో రైతు లు గెలలను విక్రయించేందుకు అవస్థలు పడాల్సి వ స్తోంది. అయితే ప్రతి 30 కి.మీ. ఒక సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.

పరిశ్రమలు ఉంటేనే ప్రయోజనం..

పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో కత్తిరించిన గెలలను గంటల వ్యవధిలోనే పరిశ్రమలో ప్రాసెసింగ్‌ చేస్తే ఎక్కువ స్థాయిలో నూనె వస్తుంది. జిల్లాలో తెంపిన గెలలను అశ్వారావుపేటకు తీసుకెళ్లేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగానే పరిశ్రమలు అందుబాటులో ఉంటే ప్రయోజనం కలుగుతోందని రైతులు అంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా..

స్థానికంగానే పరిశ్రమ ఏర్పాటుచేయాలి..

ప్రభుత్వం అందించిన రాయితీ ప్రోత్సాహం, అధికారుల సహకారంతో 7 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుచేశాను. ఇటీవల గెలలను కోసి అశ్వారావుపేటకు తరలించాను. స్థానికంగానే పరిశ్రమ ఉంటే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్‌, రైతు,

గూడెబల్లూరు, మాగనూర్‌ మండలం

త్వరలో ఇబ్బందులు తీరుతాయి..

ఆయిల్‌ఫెడ్‌ జీఎం అందించిన సమాచారం మేరకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్ద 95 ఎకరాల్లో, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో 40 ఎకరాల్లో ఆయిల్‌పాం పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. నారాయణపేట జిల్లాలోని మరికల్‌ మండలం చిత్తనూర్‌ వద్ద 80 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటుకు స్థలం సేకరణలో దాదాపు కొలిక్కి వచ్చింది. మరో కొన్ని నెలల్లో రైతులు స్థానికంగానే పంటను విక్రయించవచ్చు. – సమీనా బేగం,

జిల్లా ఆయిల్‌ఫెడ్‌ ఇన్‌చార్జి, నారాయణపేట

రైతులను ప్రోత్సహిస్తున్నాం..

జిల్లాలో ప్రస్తుతం 6వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవుతోంది. మరో 4వేల ఎకరాల్లో సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. 10వేల ఎకరాలు పూర్తిచేస్తే మన జిల్లాలోనే పరిశ్రమ ప్రారంభమవుతుంది. ఇటీవల ధర భాగా పెరిగిన పరిస్థితుల్లో రైతులు ఆయిల్‌పాం సాగుపై దృష్టిసారించాలి. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి.

– చంద్రశేఖర్‌,

జిల్లా ఉద్యానశాఖ అధికారి, నారాయణపేట

ఉమ్మడి జిల్లాలో పంట కోతలు షురూ

గెలల విక్రయానికి అశ్వారావుపేటకు వెళ్లాల్సిందే..

స్థానికంగా ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఉంటేనే రైతులకు ప్రయోజనం

ఉమ్మడి జిల్లాలో

28,999 ఎకరాల్లో సాగు

చిగురిస్తున్న ఆశలు..

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించింది. అయితే కొత్త పాలకవర్గం ఆయిల్‌పాం సాగుకు కొత్త జనసత్వాలు నింపేందుకు చర్యలు తీసుకోవడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల నారాయణపేట జిల్లాలో చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి పర్యటించి.. రూ. 300 కోట్లతో ఆయిల్‌పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమ ఏర్పాటుపై జాప్యం చేయవద్దని రైతులు కోరుతున్నారు.

ఆయిల్‌పాం కష్టాలు తీరేనా?1
1/2

ఆయిల్‌పాం కష్టాలు తీరేనా?

ఆయిల్‌పాం కష్టాలు తీరేనా?2
2/2

ఆయిల్‌పాం కష్టాలు తీరేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement