అలంపూర్: నియోజకవర్గంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మున్సిపాలిటీలోని 3 వార్డులో టీయూఎఫ్ఐడీసీ నిధులతో సీసీరోడ్ల నిర్మాణానికి మంగళవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.5 కోట్లతో ఆయా వార్డుల్లో సీసీరోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కాంట్రక్టార్లు పనులు నాణ్యతగా చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్రావు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఇంతియాజ్ అలీ, సర్దార్, శేఖర్రెడ్డి, పెద్ద ముక్తార్, నాగరాజుయాదవ్, రుక్ముద్దీన్, నాగభూషణం, రఘురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
మల్దకల్: మహిళల ఆరోగ్యంపై వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీప్యూటీ డీఎంహెచ్ఓ సంధ్యాకిరణ్మయి అన్నారు. మంగళవారం మల్దకల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు ప్రతినెలా వైద్యపరీక్షలు చేయించుకోవడంతో పాటు పోషకాలు కలిగిన ఆహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత పెంచడంతో పాటు గ్రామాల్లో 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలన్నారు. పీహెచ్సీతో పాటు ఆరోగ్య ఉపకేంద్రాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పదవీ విరమణ పొందిన రామేశ్వరమ్మను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డా.జయమ్మ, రాజు, సూపర్వైజర్ శ్రీధర్, వెంకటస్వామి, జ్యోతి పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.6,419
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 310 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ. 6,419, కనిష్టంగా రూ. 2,916, సరాసరి రూ. 4,598 ధరలు వచ్చాయి. క్వింటాల్ కందులు రాగా.. రూ. 5,206 ధర పలికింది. 115 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,939, కనిష్టంగా రూ. 5,629, సరాసరి రూ. 5,929 ధరలు లభించాయి. 2,369 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 1,920, కనిష్టంగా రూ. 1,700, సరాసరి రూ. 1,901 ధరలు వచ్చాయి.
రెండు రోజుల్లో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బోయపల్లి (డివిజన్ నం.16), హనుమానున్నగర్–న్యూగంజి (డివిజన్ నం.47)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన చోట ఎక్కువ సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు.
కాగా, ఆయా ప్రాంతాల్లో దరఖాస్తుదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇదిలాఉండగా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఎల్–1 కింద 1,400 ఇళ్లు కేటాయించారు. అయితే సుమారు రెండు వేల మంది నుంచి దరఖాస్తులు అందగా, క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీ చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, ఇన్చార్జ్ ఎంఈ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి