గద్వాల క్రైం: మెడికల్ షాపుల నిర్వాహకులు ఔషధ నియంత్రణశాఖ నిబంధనలు అతిక్రమిస్తే డ్రగ్ కాస్మోటిక్ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని జిల్లా ఇన్చార్జి ఔషధ నియంత్రణ అధికారి వినయ్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యులు సిఫారసు చేసిన మందులను మాత్రమే విక్రయించాలని మెడికల్ షాపుల నిర్వాహకులకు సూచించారు. ప్రతి మెడికల్ దుకాణంలో ఫార్మసిస్ట్ ద్వారా మాత్రమే మందులను విక్రయించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
హుండీ ఆదాయం రూ. 26.96 లక్షలు
అలంపూర్: ఆలయాల హుండీల లెక్కింపు ద్వారా రూ.26.96 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. అలంపూర్ క్షేత్రంలోని శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి, ఆలయ ఈఓ దీప్తి పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయ హుండీని లెక్కించగా రూ.24.77 లక్షలు, నిత్యాన్నదాన సత్రం హుండీని లెక్కించగా రూ.2.19 లక్షలు, స్వామివారి అన్నసత్ర హుండీల ద్వారా రూ.26.96 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. వీటితో పాటు స్వామివారి హుండీ ద్వారా విదేశీ కరెన్సీ 8 డాలర్లు, ఆస్ట్రేలియా డాలర్లు 20, కెనడా డాలర్లు 10, మిశ్రమ బంగారు 100 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి 20.5 గ్రాములు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 12వ తేదీన శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయాల్లోని హుండీలను లెక్కించగా.. రూ.99.55 లక్షల ఆదాయం వచ్చింది. వీటితోపాటు మిశ్రమ బంగారం 28 గ్రామాలు, మిశ్రమ వెండి 298 గ్రామాలు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు హుండీలలో విదేశీ కరెన్సీ యూఎస్డీ 39, ఫౌండ్లు 10, ఓమాన్ 100 బైసా హుండీల ద్వారా ఆదాయం సమకూరింది. ఆ రోజు సమయం లేకపోవడంతో శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి, నిత్యాన్నదాన సత్రం హుండీలను లెక్కించలేదు. కార్యక్రమంలో గ్రామీణ బ్యాంక్ మేనేజర్ భీమా నాగరాజు, ఆలయ అర్చకులు, సిబ్బంది, వివిధ సేవా సంస్థల సభ్యులు, బ్యాంక్ సబ్బంతి తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,050
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు సోమవారం 1,214 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,050, కనిష్టంగా రూ. 5,499, సరాసరి రూ. 5,499 ధర పలికింది. అదే విధంగా 326 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,289, కనిష్టంగా రూ. 5,759, సరాసరి రూ. 6,109 ధర వచ్చింది. 7 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,809, కనిష్టంగా రూ. 6,289, సరాసరి రూ. 6,806 ధర పలికింది.
ఓపెన్ యూనివర్సిటీ ప్రాక్టికల్స్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సైన్స్ సబ్జెక్టు సెమిస్టర్–1కు సంబంధించి ప్రాక్టికల్స్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్, ఐడీ కార్డు, ఫీజులు చెల్లించిన రశీదుతో రావాలని కోఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం కోసం సెల్ నం.73829 29609ను సంప్రదించాలని సూచించారు.
సేంద్రియ సాగుపై ఆసక్తి
● పశువుల ఎరువుపై మొగ్గు చూపుతున్న రైతులు
● పంట పొలాల్లో గొర్రెల మందలు
● సహజసిద్ధ ఎరువుతో అధిక దిగుబడులు
– వివరాలు 9లో..


